రాళ్లు రప్పలకు రైతు భరోసా ఇద్దామా ? సీఎం రేవంత్ రెడ్డి !

👉 శాసనసభలో రైతు భరోసా చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


రాళ్లు, రప్పలు, గుట్టలకు రైతు భరోసా ఇద్దామా ? రాజీవ్ రహదారి లాంటి వాటిల్లో పోయిన భూములకు రైతు భరోసా ఇద్దామా ? దళారులతో కలిసి సృష్టించిన దస్తావేజులపైనా, క్రషర్ యూనిట్లు నడుస్తున్న భూముల పైనా ఇద్దామా ? సభ్యులు చెప్పాలి.

👉 రైతు భరోసా అంశంపై శనివారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రైతు భరోసా అమలు విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని స్పష్టం చేశారు. గడిచిన ఐదేళ్లలో దాదాపు ₹ 22 వేల కోట్ల మేరకు రాళ్లు, రప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు పంచారు. అలాంటి వాటి విషయంలో అన్ని రాజకీయ పార్టీలు సూచనలు ఇవ్వాలని కోరారు.

👉 రైతు భరోసా అంశంపై సభలో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే…

👉 పోడు భూముల సాగుచేసుకునే పేద గిరిజనులు, ఆదివాసీల పేరు మీద తయారు చేసిన నకిలీ పట్టాల తో ఆయాచిత లబ్ది పొందిన వారికి కూడా ఇద్దామా ?

👉 ఒక అంచనా ప్రకారం గడిచిన ఐదేళ్లలో ₹ 72,816 కోట్ల రూపాయలు రైతుబంధు కింద ఇవ్వగా, అందులో రాళ్లు, రప్పలు, పరిశ్రమలుగా రూపాంతరం చెప్పిన భూములు, రియల్ ఎస్టేట్ లే అవుట్ చేసిన భూములకు దాదాపు ₹ 22,606 కోట్ల రూపాయల మేరకు రైతుబంధు ఇచ్చారు.

👉 రైతుకు పెట్టుబడి సహాయం అందించే రైతు భరోసా పథకం విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కరలేదని, వ్యవసాయం చేసుకునే ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు.

👉 నిరుపేదలు ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, వ్యవసాయ కుటుంబాలు, భూమినే నమ్ముకుని భూమినే అమ్మగా భావించి దానిచుట్టే జీవితం ముడిపడి ఉన్న రైతులను ఆదుకోవాలన్నదే ప్రభుత్వ ఆలోచన. అందరి సూచనలు పరిగణలోకి తీసుకుని రైతాంగానికి మరింత మేలు కలిగే రీతిలో రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పారు.

👉 “వ్యవసాయం చేసుకునే వారికి పెట్టుబడి రూపంలో నగదు రూపంలో సహాయం రైతులకు చేరవేయాలన్నదే పథకం ఉద్దేశం.

👉 గతంలో కూరగాయలు, ఆకుకూరలు పండించే హైదరాబాద్ చుట్టుముట్టు దాదాపు 50 కిలోమీటర్ల పరిధిలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కింద లే అవుట్లుగా మార్చి ప్లాట్ల కింద మారిపోయిన భూములకు కూడా ఇద్దామా ?

👉 హైదరాబాద్ చుట్టుముట్టులో వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా నాలా కన్వర్షన్ చేసి పరిశ్రమలు నెలకొల్పిన భూములకు కూడా రైతు భరోసా చెల్లించాలా సూచనలు చేయండి.

👉కీలకమైన రైతు భరోసా అంశంపై అందరి సూచనలు సలహాలు తీసుకుని అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుందాం. అనుభవం కలిగిన ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఏవైనా సూచనలు ఇస్తే స్వీకరించాలని అనుకున్నాం. కానీ వారు సభకు రాలేదు. సలహాలు, సూచనలు స్వీకరించడంలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు.

👉 రైతు భరోసాను అమలు చేయడానికి ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం వేశాం. రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడాం. సభలో లేని రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడాం.

👉 తెలంగాణ రైతాంగానికి మేలు కలిగే, సహేతుకంగా కనిపించే ప్రతి సూచనలను పరిగణలోకి తీసుకుంటాం. శాసనసభలో సభ్యులు చేసిన సూచనలను కూడా పరిగణలోకి తీసుకుంటాం. రైతులకు ప్రయోజనం కలిగించే దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది.

👉 వ్యవసాయం దండగ కాదు. వ్యవసాయం పండుగ చేయాలన్న ఉద్దేశంతోనే ₹20 వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేశాం.

👉 ప్రభుత్వం వెసులుబాటును బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి రైతులకు మేలు చేయడానికి దుబారా తగ్గిద్దాం. తద్వారా ఇంకా కొంతమందికి ఎక్కువ మేలు జరుగుతుంది. రైతులను ఆదుకోవడం ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తాం.

👉 తెలంగాణ ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తా. రైతు భరోసాపై సభ్యులందరూ సూచనలు చేయాలి. మంచి సూచనలు ఇస్తారని ఆశిస్తున్నా” అని అన్నారు.