👉రేషన్ కార్డు లేని వారికి కార్డులు !
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి జనవరి 26 నుంచి రైతు భరోసా నిధులు, భూమిలేని పేదలకు సాలిన ₹ 12 వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం తెలిపారు.
రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎకరాకు ₹12 వేల చొప్పున రైతు భరోసా చెల్లించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే వ్యవసాయ భూములు లేని రైతులకు సంవత్సరానికి ₹ 12 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని, దానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేసినట్టు చెప్పారు.
👉 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.

👉 రైతు భరోసా చెల్లింపు, భూమిలేని వ్యవసాయ దారులను ఆర్థికంగా ఆదుకోవడం, రేషన్ కార్డు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయడం వంటి కీలకమైన మూడు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మూడూ జనవరి 26 నుంచి అమలులోకి వస్తాయని చెప్పారు.
👉 సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
👉 “అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో తెలంగాణ రైతాంగానికి మంచి జరగాలి. వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలి. వ్యవసాయం దండగ కాదు. పండుగ చేయాలని తమ ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
👉 రైతు భరోసా విషయంలో రైతాంగంలో రకరకాలుగా గందరగోళం సృష్టిస్తున్నారు. ఆ గందరగోళాన్ని దూరం చేస్తూ రైతులకు శుభవార్త చెప్పాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం.
👉 వ్యవసాయయోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతుబంధు కింద ఏటా ₹ 10 వేలు ఇస్తే, మా ప్రభుత్వం ప్రజా పాలనలో రైతులందరికీ సంవత్సరానికి ₹12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం.

👉 భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకం కింద సహాయం అందించడమే కాకుండా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు ప్రతి ఏటా ₹ 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని నామకరణం చేశాం.
👉 చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవారిని పట్టి పీడిస్తోంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం.
👉 ఈ పథకాలన్నీ జనవరి 26 వ తేదీ రిపబ్లిక్ దినోత్సవం నుంచి ప్రారంభమవుతాయి. ఆరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 26 నుంచి ఈ పథకాలన్నింటినీ అమలు చేయాలని నిర్ణయించాం.
👉 వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, అంటే రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో కోల్పోయిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, నాలా కన్వర్షన్ అయిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన భూములు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తించదు.
👉 ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరిస్తారు. ధరణి లోపాల కారణంగా గతంలో కొంతమందికి ఆ రకంగా కూడా రైతు బంధు కింద నిధులు అందాయి. కాబట్టి దయచేసి అలాంటి వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించడం ద్వారా సహకరించాలి.
👉 ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని ₹10 వేల నుంచి ₹12 వేల రూపాయలకు పెంచాం. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ₹12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం.
👉 ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులు, ప్రభుత్వ ఆదాయం పెంచడం, పేదలకు పంచడం ప్రభుత్వ విధానం. ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటు మేరకు రైతులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన.”