👉 ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశాల్లో…
J.SURENDER KUMAR,
జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించడంలో తెలుగువారి పాత్ర సన్నగిల్లుతోందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడే తెలుగు భాషను, ఉనికిని, మనుగడను, మన సంప్రదాయాన్ని కోల్పోకుండా కాపాడుకోవలసిన అవసరం ఉందని చెప్పారు.
👉 ప్రపంచ తెలుగు సమాఖ్య (WTF) నిర్వహించిన 12 వ ద్వైవార్షిక సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సమాఖ్య ప్రచురించిన “తెలుగుదనం – తెలుగు ధనం” పుస్తకాన్ని ఆవిష్కరించారు.
👉 గతంలో దేశ రాజకీయాల్లో ఎంతోమంది తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారని, నీలం సంజీవరెడ్డి గారు, పీవీ నరసింహారావు గారు, ఎన్టీఆర్ గారు, కాకా వెంకటస్వామి, జైపాల్ రెడ్డి , వెంకయ్య నాయుడు లాంటి వారు ఆనాడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
👉 రాజకీయం, సినీ, వాణిజ్య రంగాల్లో ఎంతస్థాయిలో రాణించినప్పటికీ మన భాషను మరిచిపోవద్దని, పరభాషా జ్ఞానం సంపాదించాలి కానీ, మన భాషను గౌరవించాలని అన్నారు.

👉 తెలుగు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో రైతులు రుణమాఫీ విషయంలో జీవోను తెలుగులో ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. న్యాయస్థానాల్లోనూ తీర్పు ప్రతులు తెలుగులో ఉంటే ఎంతోమందికి ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు.
👉 హైదరాబాద్ నగరానికి మౌలిక సదుపాయాల కల్పనలో గతంలో చంద్రబాబు నాయుడు , వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ, తెలంగాణ రైజింగ్ నినాదంతో 2050 అభివృద్ధి ప్రణాళికలతో తెలంగాణలో ముందుకు వెళుతున్నామని, ప్రపంచంలో అత్యున్నత నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని చెప్పారు.
👉 వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులకు సింగిల్ విండో పర్మిషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
👉 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ సదస్సులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి , సమాఖ్య అధ్యక్షురాలు వీఎల్ ఇందిరా దత్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.