J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఒక సోదరుడిగా అండగా ఉంటానని మందకృష్ణ అన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని మంద కృష్ణ మాదిగ ఈ సందర్భంగా సీఎంను అభినందించారు.
వర్గీకరణ ప్రక్రియను ఒక నిబద్ధతతో చేపట్టిన ప్రజా ప్రభుత్వానికి, అభినందనలు తెలుపుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు.

షెడ్యూల్డు కులాల (SC) వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సిఫారసులను శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మంగళవారం కలిశారు.
కమిషన్ చేసిన సిఫారసుల్లో క్రీమీలేయర్ ప్రతిపాదనను తిరస్కరించి, మిగతా వర్గీకరణ ప్రతిపాదనలను శాసనసభ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే.
రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ , మాదిగ ఉపకులాల ప్రతినిధులు ముఖ్యమంత్రి తో సమావేశమయ్యారు.

ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు ఎదురు కావొద్దన్న ఆలోచనతో ప్రక్రియను చట్టబద్దంగా ముందుకు తీసుకువెళ్లామని, అందులో భాగంగానే తొలుత అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీని నియమించడంతో పాటు న్యాయ కమిషన్ ఏర్పాటు చేశామని వివరించారు. సాధ్యమైనంత తొందరగా సదరు నివేదికలను తెప్పించి, కమిషన్ సిఫార్సులను కేబినెట్ లో, ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదించామని సీఎం గుర్తుచేశారు.
ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు.