ఎమ్మెల్సీ కవితకు కంఠ శోష తప్ప కదలని క్యాడర్ …

J.SURENDER KUMAR,


మాజీ సీఎం కేసీఆర్ తనయ, జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు, భారత రాష్ట్ర సమితి నాయకురాలు, పార్లమెంట్ మాజీ సభ్యురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తన పార్టీ లీడర్లు క్యాడర్, ప్రజలను ఉద్దేశించి,  రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై చేస్తున్న ఆరోపణలు, ప్రసంగాలు, ప్రవచనాలు ఆమెకు కంఠశోషే  తప్ప క్యాడర్ లో కదలికలు, మెదలికలు లేవు అనేది సత్యం.!


ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం, పనులపై కవిత  చేస్తున్న ఆరోపణలు   ఆ  (టీఆర్ఎస్ ) పార్టీకి అలవాటుగా మారింది అనేది మెజార్టీ ప్రజల అభిప్రాయం. ఆ  ఆరోపణల పై వారి పార్టీకి చెందిన క్యాడర్  పట్టుమని పది రోజులపాటు, నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేసిన సందర్భాలు లేవనే చెప్పవచ్చు.

👉 ప్రత్యేకంగా ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే…

తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం డిసెంబర్ 9న సచివాలయంలో అధికారికంగా  ప్రతిష్టించిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పట్ల ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వం పై ( ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి పై అని చర్చించుకోవచ్చు )  వాడి వేడిగా ఆగ్ర ఆవేశాలతో చేసిన ఆరోపణలు, ఆమె  చేసిన శపథం ఆచరణకు ( దాదాపు 50 రోజులకు పైగా ) ఆమడ దూరంలో ఉంది,

👉 ఇందుకు ఇదే నిదర్శనం …

గత సంవత్సరం డిసెంబర్ 15 న ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లా కేంద్రం మున్సిపల్ పరిధి శివారు గ్రామం ధరూర్ పంచాయతీ పరిధిలోకి వచ్చే స్థలంలో  తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు  ఆమె భూమి పూజ చేశారు.

👉అనంతరం ఎమ్మెల్సీ కవిత టిఆర్ఎస్ క్యాడర్ ను ఉద్దేశించి ఇలా మాట్లాడారు….

ప్రభుత్వం ఎన్ని జీవోలు, గెజిట్‌లు జారీ చేసినా అసలు తెలంగాణ తల్లిని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమకు స్ఫూర్తినిచ్చి, ధైర్యాన్ని ఇచ్చినా తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను కాపాడేందుకు తాను కట్టుబడి ఉన్నాను . అంటూ తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తోందని, ఎమ్మెల్సీ కవిత బహిరంగ సమావేశంలో ఆరోపించారు.
ప్రతి గ్రామంలో అసలైన ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని గ్రామ, గ్రామాన ప్రతిష్టిస్తాం మన ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పాలని  టిఆర్ఎస్ కేడర్ కు పిలుపునిచ్చారు. ఇదే సందర్భంలో జగిత్యాల గడ్డ టిఆర్ఎస్ అడ్డా అంటూ ఇక్కడి నుంచి పోరాటం మొదలు అంటూ పిడికిలి బిగించారు

2024 డిసెంబర్ 15న జగిత్యాల లో తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ ( ఫైల్ ఫోటో)

.


దాదాపు 55 రోజులు గడిచిన జిల్లాలో 20 మండలాలలోని  ఏ గ్రామంలోను ఎమ్మెల్సీ కవిత కోరుకున్న తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం ఎలాంటి భూమి పూజ పనులు , ప్రయత్నాలు సైతం జరగలేదు.  దీనికి తోడు ఎమ్మెల్సీ కవిత డిసెంబర్ 15 న ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం  ఆమె  స్వయాన పూజ చేసిన భూమి స్థలంలోనూ విగ్రహ ఏర్పాటు పనులు  ఆరంభం కాకపోవడం ప్రస్తానారం.


ఇకపోతే ఎమ్మెల్సీ కవిత ఏదైనా అంశంపై వివరించే, ప్రసంగించే తీరు, ఆ అంశం పై సంపూర్ణ అవగాహనతో మాటల తీరు, కవితతో పాటు వారి కుటుంబానికి భగవంతుడు ఇచ్చిన వరం. వారి మాటలు  పండితులతో పాటు పామరులను సైతం ఆ కట్టుకుంటాయి అనేది  ఒప్పుకోవాల్సిందే, రాజకీయంగా వారిని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు సైతం  ఒప్పుకోక తప్పదు. అయితే కొన్ని నెలలుగా  ఎమ్మెల్సీ కవిత చేస్తున్న రాజకీయా ఆరోపణలు, మీడియా సమావేశాలలో ఆమె  ప్రసంగాలు చిత్ర విచిత్రంగా అగుపిస్తున్నాయి.


గురువారం హైదరాబాదులో ఆమెను కలిసిన జగిత్యాల జిల్లాకు చెందిన  కొందరు మాజీ సర్పంచులు ఆ పార్టీ నాయకుల సమక్షంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రైతు భరోసా డబ్బులు చెల్లించాలని, మాజీ సర్పంచులకు రావలసిన పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సర్పంచుల తమ పదవీ సంవత్సరం క్రితమే కోల్పోయారు సంవత్సర కాలంగా ఈ సమస్య పట్ల కవిత స్పందించిందో ? లేదో ? మాజీ సర్పంచులకే తెలియాలి.


ఇకపోతే ఆమె ఎత్తుకున్న  బీసీ నినాదం సీఎం కేసీఆర్ 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో  బీసీలకు దక్కిన కీలక నామినేటెడ్ పదవులు, రాజ్యాధికారంలో వారికి జరిగిన న్యాయం ఏమిటో ?  ఆమె స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉంది.

ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్ కావాలి అంటూ ఆందోళన ( ఫైల్ ఫోటో)


గతంలో మహిళా రిజర్వేషన్లు పోరాటం అంటూ హడావిడి చేస్తూ చట్టసభలో మాకు రిజర్వేషన్ కావాలి అంటూ మీడియా సమావేశాల్లో, ప్రచారం మాధ్యమా ల్లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషలలో అనర్గళంగా మాట్లాడుతూ  వీర వనితలా  హావభావాలు వ్యక్తం చేస్తూ కలరింగ్ ఇచ్చిన ఆ  మహిళా రిజర్వేషన్ ల ఉద్యమం నేటికీ ఉలుకు,పలుకు ,కదలికలు లేవు. ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు భారత జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఆమె ధర్నా చేపట్టారు.


దీనికి తోడు లిక్కర్ కేసు లో  తిహారి జైల్ నుంచి  కోర్టుకు హాజరు సందర్భంలో ఆమె ‘జై తెలంగాణ,  ‘తెలంగాణ తల వంచదు’  అంటూ ఎమ్మెల్సీ కవిత పిడికిలి బిగించి చేసిన నినాదాలు ప్రచార మాధ్యమాల్లో చూసిన  న్యాయమూర్తి   మరోసారి ఇలాంటి నినాదాలు చేస్తే చర్యలు తప్పవని  కవితను హెచ్చరించిన విషయం తెలిసిందే.

E D కస్టడీలో ఉండి కోర్టుకు హాజరవుతూ జై తెలంగాణ నినాదం చేస్తున్న దృశ్యం ( ఫైల్ ఫోటో)


గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మహిళా రిజర్వేషన్ల పోరాటం, రాజ్యాధికారం లో బీసీల వాటా, నాడు సిట్టింగ్ సర్పంచ్ లు  కాంట్రాక్ట్ పనుల బిల్లులు, అధికారికంగా ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు, జాగృతి సంస్థ కార్యకలాపాలు, తెలంగాణ జనం , గ్రామాల్లో బీఆర్ఎస్ క్యాడర్ ఎమ్మెల్సీ కవితకు గుర్తుకు రాకపోవడమే  ఆమె కంఠశోష కు కారణం కావచ్చు!