శివశంకర్ జన్మదినం ను తెలంగాణ ప్రవాసీ దివస్’ గా నిర్వహించాలి !


J.SURENDER KUMAR,


విదేశీ వ్యవహారాల కేంద్ర మంత్రిగా సేవలందించిన తెలంగాణ ముద్దుబిడ్డ స్వర్గీయ పి. శివశంకర్ జన్మదినం ఆగస్టు 10 న ప్రతి ఏటా ‘తెలంగాణ ప్రవాసీ దివస్’ ను నిర్వహించాలని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి డిమాండ్ చేశారు.

ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డికి మెయిల్ ద్వారా వినతి పత్రం పంపించారు. వివిధ దేశాలలో ఉన్న ఎన్నారై లను మాతృభూమి తెలంగాణకు అనుసంధానం చేయడం, వారి సేవలను ప్రభుత్వం గుర్తించి సత్కరించడం, పెట్టుబడుల ప్రోత్సాహం గురించి ఈ అవకాశాన్ని ఉపయోగించవచ్చని భీమ్ రెడ్డి వినతి పత్రంలో పేర్కొన్నారు.

 
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో. పి. శివశంకర్ 1986 లో 12 మే నుంచి 22 అక్టోబర్ వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా,. వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా శివశంకర్ నిర్వహించారు. విదేశాలలో భారతీయ ఉత్పత్తులకు ఒక సువర్ణావకాశం లభించింది. గల్ఫ్ ఉపాధి, ఉద్యోగాల నియామకాల్లో మోసాలను అరికట్టడానికి గాను న్యాయశాస్త్రంలో తనకు ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎమిగ్రేషన్ చట్టానికి సవరణలు చేయించారు.

గల్ఫ్ దేశాలలో ప్రవాసులు తాము పొందిన అనుభవము, సంపాదనతో మాతృభూమికి తిరిగి వచ్చిన తర్వాత వారికి పునరావాసం, స్వయం ఉపాధి కల్పన దిశగా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అంతకు ముందు ఇందిరా గాంధీ మంత్రివర్గంలో పనిచేశారు. 1974 నాటికి చిన్న వయసులోనే శ్రీ పి. శివశంకర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి స్థాయికి ఎదిగారు. ఎమర్జెన్సీ మరియు ఎమర్జెన్సీ అనంతరం శ్రీమతి ఇందిరా గాంధీ కి ప్రత్యేక న్యాయవాదిగా సేవలందించారు.

న్యాయ కోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు, న్యాయశాఖ మంత్రిగా, న్యాయ శాస్త్రంలో, ఇంగ్లీష్ భాషలో మంచి పట్టుతో పేరుగాంచారు. ఇంధన, వాణిజ్య, విదేశీ వ్యవహారాల, మానవ వనరుల శాఖల మంత్రిగా, గవర్నర్ గా, జాతీయ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.
10 ఆగస్టు 1929 న హైదరాబాద్ జిల్లా మామిడిపల్లి లో ఒక పేద మున్నూరుకాపు కుటుంబంలో జన్మించిన పి. శివశంకర్ 27 ఫిబ్రవరి 2017 న మృతి చెందారు.