వరంగల్ కు విమానాశ్రయం పెద్ద అసెట్ సీఎం రేవంత్ రెడ్డి!

J.SURENDER KUMAR,


వరంగల్ మామునూరు విమానాశ్రయం కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలని, ప్రతి నిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వరంగల్ నగరానికి విమానాశ్రయం ఓ అసెట్ గా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని చెప్పారు.


👉 వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ వేగంగా జరగాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివాసంలో శనివారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.


👉 విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ, పెండింగ్ అంశాల వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైన తొందరగా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసి డిజైనింగ్ కు పంపించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ప్రతి నెల తనకు ప్రగతి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.


👉 మామునూరు విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కృషి చేసిన ముఖ్యమంత్రికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.


👉 ఈ సమావేశంలో మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , కొండా సురేఖ , ధనసరి అనసూయ సీతక్క గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఎంపీలు కావ్య , చామల కిరణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి , రేవూరి ప్రకాష్ రెడ్డి , నాగరాజు , వరంగల్ మేయర్ గుండు సుధారాణి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.