👉 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలకు సిద్ధం ఆ పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ !
J.SURENDER KUMAR,
తాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలు జరపడానికి భేషరతుగా సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన పత్రికా ప్రకటన లో పేర్కొన్నారు.
ప్రజల ప్రయోజనాల కోసం మేము ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమే. అందుకే శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ప్రతిపాదన చేస్తున్నాం.
అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ పేరుతో ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర (గడ్చిరోలీ), ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చేస్తున్న హత్యకాండలను, నరసంహారాన్ని (జీనోసైడ్)ను నిలిపివేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపివేయాలని ప్రతిపాదిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తే మేం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తాం.

మేము చేస్తున్న ఈ ప్రతిపాదనల ఆధారంగా శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుక రావాలని శాంతి చర్చల కమిటీకి, దేశంలోని ప్రజాపక్ష మేధావులకు, రచయితలకు, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు, హక్కుల సంఘాలకు, ఆదివాసీ, దళిత సంఘాలకు, విద్యార్థి యువజనులకు, పర్యావరణ కార్యకర్తలకు తదితరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, నగరాల్లో, జిల్లా, తాలూకా కేంద్రాల్లో, యూనివర్సిటీల్లో ప్రచార క్యాంపెయిన్ ను చేపట్టాల్సిందిగా కోరుతున్నాం. అని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ ప్రకటనలో పేర్కొన్నాడు.