J.SURENDER KUMAR,
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో ఆదివారం తలంబ్రాల తయారీ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది.
శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ కార్యక్రమం శ్రీవారి సేవకులతో టీటీడీ ప్రారంభించింది.

ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా కల్యాణవేదిక వద్ద గల పిఏసి వద్దకు తీసుకొచ్చారు.
శ్రీ సీతా రామ కళ్యాణం కోసం తలంబ్రాల తయారీకి అవసరమయ్యే పసుపు వినియోగించేందుకు ఏప్రిల్ 3న పుసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. హాలులో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేసి, తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు.

కడప, అన్నమయ్య జిల్లాల నుండి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో సేవలందించేందుకు శ్రీవారి సేవకులు వచ్చారు. దాదాపు 425 మంది శ్రీవారి సేవకులు లక్షకు పైగా తలంబ్రాల ప్యాకెట్ల తయారీలో పాల్గొంటున్నారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, పిఆర్ఓ (ఎఫ్ఏసి) కుమారి నీలిమ, ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.