విద్యార్థుల భవిష్యత్తు కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తా!

👉 బసవేశ్వర 892 వ జయంతి సందర్భంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J. SURENDER KUMAR,


ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు విద్యార్థినీ విద్యార్థులే వారధులుగా ముందుండి గ్రామాల్లో ప్రజలకు చేరవేయాలి.  విద్యార్థుల భవిష్యత్తు కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తా” అని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అన్నారు.

👉 మహాత్మ బసవేశ్వర 892వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి  ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ సలహాదారులు, ప్రజాప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ..

👉 తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం నూటికి నూరు శాతం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. సంఘ సంస్కర్త బసవన్న  స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు.

👉 “సమాజంలో మార్పుల కోసం 12 వ శతాబ్దంలోనే పునాదులు వేసిన గొప్ప సంఘ సంస్కర్త బసవన్న. కుల, మత, లింగ వివక్షల వంటి సమాజ అవలక్షణాలను తొలగించాలని, సమ సమాజాన్ని నిర్మించాలని బసవన్న  ఎనలేని కృషి చేశారు. సమాజంలో బసవన్న గారు, జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ , మహాత్మా గాంధీ లాంటి వారు ప్రతి మనిషికి సమానమైన హక్కులు కల్పించి గౌరవంగా బతకాలని కోరుకున్నారు.

👉 ప్రతి మనిషి గౌరవంగా బతకడానికి అవసరమైన ప్రణాళికలను రచిస్తూ ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాలి. ప్రజా ప్రభుత్వం ఆ కోవలోనే బాధ్యతతో ప్రజల దగ్గరికెళ్లి సమస్యలు తెలుసుకుని హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తోంది.

👉 దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణలో బీసీ కులగణన చేశాం. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశాం. వీటన్నిటినీ పకడ్బందీగా అమలు చేస్తాం. అందుకు అందరి నుంచి సంపూర్ణమైన మద్దతు ఉండాలి.

👉 నిరుపేదలకు సన్నబియ్యం, ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం, పేదవారికి ఇండ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ₹ 500 లకే సిలిండర్ అందివ్వడంతో పాటు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చాం. రాష్ట్రానికి ₹ 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం.

👉 బసవన్న స్ఫూర్తిగా ప్రజాస్వామిక విలువలు కాపాడాలి. ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన అందించాలి. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి. బసవేశ్వరుడి స్పూర్తితో నడుస్తున్న ఈ ప్రభుత్వం,  భవిష్యత్తులోనూ అదే మార్గంలో నడుస్తుంది.

👉 వీరశైవ లింగాయత్ ల సంక్షేమం, అభివృద్ధి కోసం వారిచ్చిన విజ్ఞాపనలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నేను మాట ఇచ్చానంటే నూటికి నూరు శాతం అమలు చేస్తా. రాబోయే పదేళ్ల పాటు తెలంగాణ ప్రజలకు జనరంజకమైన పరిపాలన అందిస్తాం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.