బాధిత కుటుంబాన్ని ఆదుకున్న సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

అల్లారుముద్దుగా పెంచుకున్న పాప ఒక్క‌సారిగా అనారోగ్యానికి గురైంది. ఆసుప‌త్రికి తీసుకెళితే బ్ల‌డ్ క్యాన్స‌ర్ అని ప‌రీక్ష‌ల్లో తేలింది. పాప‌ను ర‌క్షించుకునేందుకు త‌ల్లిదండ్రులు ల‌క్ష‌లు వెచ్చించారు. విష‌యం ముఖ్యమంత్రి  ఎ.రేవంత్ రెడ్డి  దృష్టికి రావ‌డంతో పాప చికిత్సకు ₹ 8 ల‌క్ష‌లు మంజూరు చేశారు.

👉 అయితే, వ్యాధి ముద‌ర‌డంతో పాప ప్రాణాలు కోల్పోయింది. ఆమె చికిత్స‌కు గ‌తంలో చేసిన వ్య‌యానికి సంబంధించి మ‌రో  ₹ 7 ల‌క్ష‌ల‌ను CMRF నుంచి విడుద‌ల చేయాల‌ని ముఖ్యమంత్రి  ఆదేశించ‌డంతో అధికారులు ఆ మొత్తాన్ని విడుదల చేశారు. 

👉 హైద‌రాబాద్ ఎల్బీ న‌గ‌ర్‌కు చెందిన ర‌ఘు, మంజుల దంప‌తులు. ర‌ఘు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఆ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు. పెద్ద కుమార్తె వేద‌వ‌ల్లికి (5) 2022లో తీవ్ర జ్వ‌రం రావ‌డంతో ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ప‌రీక్షించిన వైద్యులు ఆమెకు బ్ల‌డ్ క్యాన్సర్ (అనాప్లాస్టిక్ లార్జ్ సెల్ లార్జ్ లింఫోమా) అని తేల్చారు.

👉 పాప‌ను ర‌క్షించుకునేందుకు రెండేళ్ల పాటు త‌ల్లిదండ్రులు ప‌లు ఆసుప‌త్రుల చుట్టూ తిరిగారు. చికిత్స వ్య‌యం నానాటికీ భార‌మవ‌డంతో 2024లో ముఖ్య‌మంత్రి  .రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకువ‌చ్చారు. స్పందించిన ముఖ్య‌మంత్రి  బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రిలో వేద‌వ‌ల్లి చికిత్స‌కు అవ‌స‌ర‌మైన  ₹ 8 ల‌క్ష‌ల‌ను మంజూరు చేశారు.

👉 చికిత్స అందించిన‌ప్ప‌టికీ అప్ప‌టికే వ్యాధి తీవ్ర‌త పెర‌గ‌డంతో గ‌తేడాది చివ‌ర‌లో వేద‌వ‌ల్లి మ‌ర‌ణించింది. ఆమె చికిత్స‌కు గ‌తంలో ఆ కుటుంబం పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేసింది. దీంతో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ₹ 7 ల‌క్ష‌లు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి  అధికారుల‌ను . ఆదేశించి ముఖ్యమంత్రి మానవత్వాన్ని చాటుకున్నారు.

👉 ముఖ్య‌మంత్రి ఆదేశం మేర‌కు మంజూరు చేసిన ₹ 7 ల‌క్ష‌ల చెక్కును సీఎం ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు గురువారం సచివాలయంలో వేద‌వ‌ల్లి తండ్రి ర‌ఘుకు అంద‌జేశారు.