👉 ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో 500 ఇండ్లు !
👉 ఈనెల 5 నుంచి 20 వతేదీ వరకు 28 మండలాల్లో భూభారతి !
👉 నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి !
👉 జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి !
J SURENDER KUMAR,
ఇందిరమ్మ ఇండ్ల పధకంలో భాగంగా నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇండ్లకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రెవెన్యూ. హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
👉 లబ్దిదారుల ఎంపిక ఎంతవరకు పూర్తయితే అంతవరకు ఏరోజు కారోజు ఇన్ఛార్జి మంత్రుల నుంచి లబ్దిదారుల జాబితాకు ఆమోదం తీసుకోవాలని అలాగే ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో కనీసం 500 ఇండ్లను కేటాయించి లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు.
👉 తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణ రావుతో కలిసి భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ లు, ఎస్.పి లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం జరిగేలా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
👉 అనర్హులని తేలితే ఇండ్ల నిర్మాణం మధ్యలో ఉన్నాకూడా రద్దు చేస్తామన్నారు. లిస్ట్-1, లిస్ట్-2 , లిస్ట్-3 లతో సంబంధం లేకుండా నిరుపేదలను ఎంపిక చేయాలన్నారు.
👉 ఈ నెల 5 నుంచి 20వ వరకు.. రెవెన్యూ సదస్సులు !

👉 గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు జిల్లాకొక మండలం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు.
👉 పైలట్ మండలాల్లో వచ్చిన దరఖాస్తులను ఈనెల 31వ తేదీవరకు పరిష్కరించాలని , పరిష్కారం కాని వాటికి ఎందుకు పరిష్కరించడం లేదనే విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేస్తూ దరఖాస్తును తిరస్కరించాలని కలెక్టర్లకు సూచించారు.
👉 605 మండలాలకు గాను ఇప్పటి వరకు 590 మండలాల్లో అవగాహనా సదస్సులను నిర్వహించడం జరిగిందని ఇందులో 85,527 మంది పౌరులు, 1,62, 577 మంది రైతులు పాల్గొన్నారని తెలిపారు.
👉 ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులలో నమోదు చేయాలని, అసైన్డ్ ల్యాండ్లకు సంబంధించి పొజిషన్ మీద ఉండి పట్టా లేనివారు, పట్టాఉండి పొజిషన్ మీద లేనివారి వివరాలను సేకరించాలని సూచించారు.
👉 నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు !

విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈనెల 4 న జరగనున్న నీట్ పరీక్షకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
👉 ఈ ఏడాది రాష్ట్రం నుండి 72,572 మంది విద్యార్దులు నీట్ పరీక్షకు హాజరవుతున్నారని ఇందుకోసం 24 జిల్లాల్లో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.
👉 పరీక్షా కేంద్రాల్లో త్రాగు నీరుతోపాటు ఓ ఆర్ ఎస్ ప్యాకట్లు, మెడికల్ కిట్ లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
👉 పరీక్షకు హాజరయ్యే విద్యార్దులకు అవసరమైన సూచనలను ముందుగానే ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని సూచించారు
వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల కలెక్టరేట్ నుండి. కలెక్టర్ సత్య ప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ , అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, మరియు ఆర్డీవోలు మధుసూదన్ , జీవాకర్ రెడ్డి శ్రీనివాస్ ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు మరియు సంబంధిత పాల్గొన్నారు