ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. వచ్చే రెండేండ్లలో 2027 జూన్ నాటికి కృష్ణాపై అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా నిర్ణీత గడువుతో పాటు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు.


👉 రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, అనుసరించాల్సిన కార్యాచరణపై ముఖ్యమంత్రి  జలసౌధలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ , , ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు , నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యే ప్రాజెక్టుల పనులను వేగంగా చేపట్టాలని సూచించారు.


👉 కృష్ణా బేసిన్‌లో ప్రాధాన్యతగా ఎంచుకున్న ప్రాజెక్టులకు అవసరమైన నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. భూసేకరణ వేగంగా పూర్తయ్యేందుకు రెవిన్యూ విభాగంతోనూ సమన్వయం చేసుకోవాలని, స్పెషల్ ఆఫీసర్లు పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.


👉 సూదిని జైపాల్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దండాపూర్ వరకు మొదటి ప్రాధాన్యంగా పూర్తి చేయాలని చెప్పారు. ఉద్దండాపూర్ వరకు పెండింగ్‌లో ఉన్న పనులు 18 నెలల్లో పూర్తి చేయాలని, అందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక చేసుకోవాలని చెప్పారు.


👉 కోయిల్ సాగర్ లిఫ్ట్ ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్‌లోగా పూర్తి చేయాలని చెప్పారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్, జహహర్ నెట్టెంపాడు లిఫ్ట్, రాజీవ్ భీమా లిఫ్ట్ ప్రాజెక్టులను ఈ ఏడాది డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులు, కావాల్సిన నిధుల వివరాలను ముఖ్యమంత్రి  అధికారులను అడిగి తెలుసుకున్నారు.


👉 తెలంగాణ ప్రయోజనాలే ప్రాధాన్యతగా కృష్ణా జలాల్లో రాష్ట్రానికి న్యాయ‌బ‌ద్ధంగా రావాల్సిన వాటాల సాధనకు చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు.


👉  కృష్ణా న‌ది ప‌రివాహ‌క ప్రాంతం సుమారు 70 శాతం తెలంగాణ‌లో ఉంటే కేవ‌లం 30 శాతం మాత్ర‌మే ఏపీలో ఉన్నందున.. కృష్ణా జ‌లాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకునేలా ట్రిబ్యునల్ ఎదుట పట్టుబట్టాలని చెప్పారు.


👉  గోదావరి బేసిన్ నుంచి పట్టిసీమ ద్వారా ఏపీ తీసుకుంటున్న 90 టీఎంసీలను ఎగువన వాడుకునేలా నీటి కోటా పెంచుకోవాలని చెప్పారు. ఈ అంశాలన్ని కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.


👉 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణాపై నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు కేటాయించిన నిర్ణీత నీటి వాటాల విషయంలో ప్రభుత్వ వాదనలు సమర్థంగా ఉండాలని అప్రమత్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టేటప్పుడు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నీటి వాటాల అనుమతులు తీసుకోవాలని ముఖ్యమంత్రి  సూచించారు
.