👉 కృష్ణాతీరం లోని సంగమేశ్వరుని దర్శనానికి సరిహద్దు పంచాయతీ
👉 ఏపీ పరిధిలోని ఆలయం వద్దకు తెలంగాణ బోట్లను అడ్డుకుంటున్న ఏపీ జాలర్లు !
👉 స్వామి దర్శనానికి కష్టాలు పడుతున్న తెలంగాణ భక్తులు
👉 సంవత్సరంలో 4 నెలలు మాత్రమే సంగమేశ్వరుడి దర్శనం !
J.SURENDER KUMAR,
సంవత్సరంలో నాలుగు నెలలు మాత్రమే ఆలయం తెరచుకుని ఉంటుంది. మిగితా కాలమంతా నీటిలోనే మునిగి ఉంటుంది. ఏడు నదులు ఒక చోట కలిసే సంగమేశ్వర క్షేత్రంలో స్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తులకు కష్టాలు తప్పడం లేదు.
కృష్ణాతీరానికి ఇరువైపులా ఉన్న స్థానిక గ్రామాల జాలర్లు, బోట్ల నిర్వాహకుల మధ్య వివాదం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు పంచాయతీని తీసుకువచ్చింది.
ఫలితంగా సంగమేశ్వరుని దర్శనం కోసం వస్తున్న భక్తులు, పర్యాటకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
👉 సప్తనదుల సంగమం, ఏడాదిలో నాలుగు నెలలే దర్శనం.!
కృష్ణానది ఒడ్డున ఉన్న సంగమేశ్వర ఆలయం శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణ సమయంలో బ్యాక్ వాటర్లో మునిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని కొత్తపల్లి మండల పరిధిలో ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి మట్టం తగ్గాక ఆలయం కనిపిస్తుంది.
మార్చి నుంచి జూన్ వరకు రిజర్వాయర్లో నీరు లేని సమయంలోని భక్తుల దర్శనానికి అందుబాటులో ఉంటుంది. మిగితా ఏడాదంతా నీటిలోనే మునిగి ఉంటుంది.

👉 సప్త నదులు..
కృష్ణ, వేణి, తుంగ, భద్ర ,మలాపహారిణి, భీమరథి, భవనాశిని నదులు ప్రవహించే ఏడు నదుల సంగమ క్షేత్రంగా సంగమేశ్వరాన్ని పేర్కొంటారు.
👉 పురాతన చరిత్ర !

ఆలయంలో శివలింగాన్ని పాండవుల్లో ఒకరైన భీముడు రాయితో కాకుండా వేపధారు(చెక్క)తో ప్రతిష్టించడం ఇక్కడి ప్రత్యేకత, దీనికి తోడు నంది విగ్రహం గర్భాలయంలో శివలింగానికి అడుగు దూరంలో ఉండడం ప్రత్యేకత !
👉 ఇరు రాష్ట్రాల జాలర్ల మధ్య నీటి సరిహద్దు వివాదం !

సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు హైదరాబాద్, తెలంగాణ ఇతర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు నాగర్కర్నూల్ జిల్లాలోని కృష్ణాతీరంలో ఉన్న సోమశిలకు చేరుకుంటారు.
ఇక్కడి నుంచి బోటులో సంగమేశ్వర ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. సోమశిల నుండి బోటు సంగమేశ్వర ఆలయం కు కేవలం 50 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది.
అయితే ఆలయం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటంతో సంగమేశ్వరం, సిద్దేశ్వరం గ్రామాలకు చెందిన జాలర్లు, బోట్ల నిర్వహకులు తెలంగాణ నుంచి వచ్చే బోట్లను సంగమేశ్వర ఆలయం దరిదాపుల్లోకి బోట్ లు రాకుండా అడ్డుకుంటున్నారు.

తమకు ఆదాయం రావడం లేదని అభ్యంతరం చెబుతుండటంతో తరచుగా వీరి మధ్య వివాదం చెలరేగుతోంది.
దీంతో గత కొన్ని రోజులుగా సంగమేశ్వర దర్శనం కోసం వస్తున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
మొదట తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా సోమశిల నుంచి బోటులో బయలుదేరితే ఏపీ పరిధిలోని సిద్ధేశ్వరం తీరం వద్ద బోటును నిలిపివేస్తున్నారు.
అక్కడి నుంచి 3 కి.మీ దూరంలోని సంగమేశ్వరం వరకు ఆటోలో ప్రయాణించి ఆలయాన్ని చేరుకుంటున్నారు. దర్శనం తర్వాత ఆటోలో సిద్ధేశ్వరం వరకు వచ్చి, అక్కడి కృష్ణానదిలో ఏపీకి చెందిన జాలర్ల బోట్లలో సోమశిలకు చేరుకోవాల్సి వస్తోంది.

ఇందుకోసం ఒక్కో చోట రూ. వంద చొప్పున ఒక్కొక్కరి నుంచి మొత్తం రూ. 300 వసూలు చేస్తున్నారు. బోటు నుంచి ఆటో, ఆటో నుంచి మళ్లీ బోటుకు మారి ప్రయాణించేందుకు కనీసం 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. ఇరు రాష్ట్రాల జాలర్ల సరిహద్దు వివాదంతో పర్యాటకులు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
👉 ( గత నెల ఏప్రిల్ 21న సోమశిల లో జరిగిన TUWJ (IJU) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి వెళ్లిన నాతో పాటు యూనియన్ నాయకులకు అగుపించిన నేపథ్యంలో.. కథనం )
👉 ( మిత్రుడు సీనియర్ పాత్రికేయుడు వెంకటేష్ సహకారంతో…..)