వారి మండలం ఒకటే  –  దారులు వేరు !

👉 నక్సలైట్ నాయకుడు ఒకరు – పోలీస్ ఉన్నత అధికారి మరొకరు !


J.SURENDER KUMAR,


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ నాయకుడు  నంబాల కేశవరావు, దేశంలో నే శాంతి భద్రతల పరిరక్షణలో తీవ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణచి అధికారిగా గుర్తింపు పొందిన ఏపీ మాజీ డిజిపి ( డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  ) హెచ్ జే  దొర  స్వ గ్రామాలు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం.


శాంతి భద్రతల పరిరక్షణ,  తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని, తో పాటు సంఘ వ్యతిరేక శక్తుల నిరోధంలో మాజీ డిజిపి దొర పాత్ర గూర్చి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా పోలీస్ అధికారిగా ప్రత్యేక గుర్తింపు ఉంది.


బుధవారం భద్రతా దళాల కాల్పులు హతమైన నంబాల కేశవరావు @ బసవరాజు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండలం జియాన్న పేట, కలింగ సామాజిక వర్గం.జిల్లాలో బలమైన సామాజిక వర్గం పోలీస్ అధికారి ది అదే సామాజిక వర్గం .


👉 నంబాల కేశవరావు గూర్చి..

శ్రీకాకుళం జిల్లా కేశవరావు ఇల్లు (ఫైల్ ఫోటో)


మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా 2018 నవంబర్ లో బాధ్యతలు చేపట్టిన సంవత్సరకాలం తర్వాత  నంబల కేశవరావు, స్వగ్రామం ఆయన గూర్చి  ప్రత్యేక వార్త కథనం కోసం ఓ జర్నలిస్ట్ కేశవరావు గ్రామానికి వెళ్ళాడు.  

కుటుంబ సభ్యులు విశాఖలో ఉంటున్నారని గ్రామస్తులు తెలిపారు. కేశవరావు బంధువర్గం మాటల్లో కబడ్డీ క్రీడాకారుడు , నక్సలైట్ లో పెద్ద నాయకుడని వారు వివరిస్తూ మా మండలం జాసింగ్ గ్రామం  డిజిపి దొరది అనే వివరిస్తూ జిల్లా, వారిద్దరి మండలం  ఒక్కటే దారులు వేరు అంటూ వివరించారు.

కేశవరావు గ్రామం ( ఫైల్ ఫోటో)


👉భద్రత బలగాలు గొప్ప విజయం సాధించాయి . అమిత్ షా !


హోంమంత్రి  అమిత్ షా  భద్రత బలగాలు గొప్ప విజయం సాధించాయి అంటూ వారిని అభినందిస్తూ బుధవారం ట్విట్ చేశారు


👉 నంబాల కేశవరావు

నంబాల కేశవరావు 1955 ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండలం జియన్నపేట గ్రామం.  కేశవరావు తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు తల్లి లక్ష్మీనారాయణమ్మ. కేశవరావు ముగ్గురు సోదరులు ముగ్గురు తోబుట్టువులు.. వ రెండో వాడు కేశవరావు. కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. తాతగారి ఊరు అయిన టెక్కలి మండలం తలగాంలో ఉన్నత పాఠశాల విద్య, టెక్కలి జూనియర్‌ కళాశాలో ఇంటర్‌ చదివారు.

కేశవరావు సమీప బంధువును, గ్రామస్తులను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ చారి ( ఫైల్ ఫోటో)


👉 వరంగల్‌లో ఆర్ ఇ సి లో బీటెక్‌  చేశారు.
కబడ్డీ అంటే ఎక్కువ ఇష్టపడేవారు. వరంగల్‌లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీ.టెక్ పూర్తిచేసిన ఆయన అక్కడే ఎంటెక్‌ చదివారు. నంబాల కళాశాలలో చదువుతున్నప్పుడే విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు.


👉 రాడికల్ ఉద్యమంలోని సూరపనేని జనార్దన్, జన్ను చిన్నా ప్రభావంతో కేశవరావు అటువైపు అడుగులు వేశారు. ఆర్​ఈసీ విద్యార్ధులతో సీపీఐఎంల్‌ నాయకుడు కొండపల్లి సీతారామయ్య సమాలోచనలు సాగిస్తుండడం విద్యార్ధులకు మార్గదర్శనం చేస్తుండడంతో సీతారామయ్యతో కేశవరావుకు సాన్నిహిత్యం పెరిగింది.


👉 1976లో పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. నాటి నుంచి నేటి వరకు విప్లవ ఉద్యమంలోనే కొనసాగారు. ఎంటెక్‌ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పారు.


👉 1980లో పీపుల్స్ వార్ పార్టీ గెరిల్లా జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కేశవరావును విశాఖపట్నం-తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దులోని మన్యం ప్రాంతానికి ఇన్‌ఛార్జీగా నియమించింది.


👉 పీపుల్స్‌ వార్ ఈస్ట్ డివిజన్‌ బాధ్యునిగా కేశవరావు వ్యవహరించారు. గిరిజనులతో కలిసి ఉద్యమ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా పోలీసులు కేశవరావుపై నిఘా పెట్టారు.


 👉 1980లో శ్రీకాకుళంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) అనే రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఒక్కసారి మాత్రమే అరెస్టు చేశారు. కొద్దిరోజులకే బెయిల్‌పై విడుదలైన నంబాల ఆ తర్వాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

👉 దండకారణ్య కమిటీ  

ఈస్ట్ డివిజన్‌కు గంగన్న పేరుతో కార్యదర్శిగా పనిచేసిన కేశవరావు మధ్యప్రదేశ్‌లోని బస్తర్ జిల్లా, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్ జిల్లా ఈ నాలుగు ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు చేశారు.


👉 ఈ కమిటీకి కేశవరావు ఇన్‌ఛార్జీ కాగా కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ సభ్యులుగా ఉండేవారు. దేశంలో బలమైన రెండు సాయుధ మావోయిస్టు గ్రూపుల్లో ఒకటైన మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ (ఎంసీసీ), పీపుల్స్ వార్ విలీనమై 2004 సెప్టెంబర్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)గా ఆవిర్భవించిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగారు.


👉 వయోభారం, అనారోగ్యంతో 2018లో గణపతి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆ స్థానంలో కేశవరావు బాధ్యతలు చేపట్టారు.


👉 1987 బస్తర్‌ అడవుల్లో మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ, మల్లుజోల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలిసి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం మాజీ సభ్యుల బృందం నుంచి ఆకస్మిక దాడుల వ్యూహాలు, జెలటిన్ నిర్వహణలో శిక్షణ పొందారు. తర్వాత కాలంలో గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు.


👉 పీపుల్స్‌వార్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన కేశవరావు పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ పేరు సీపీఐ మావోయిస్టుగా మార్చగా ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు.


👉 మావోయిస్టు పార్టీ వ్యూహాత్మక నిర్ణయాల్లో కీలకపాత్ర పోషించిన కేశవరావు 2018లో గణపతి రాజీనామాతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల చేపట్టారు.


 👉 మావోయిస్టు పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన నంబాల కేశవరావు 2010 ఏడాది ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడలో 76 మంది జవాన్ల మృతి ఘటన, 2019 మహారాష్ట్ర గడ్చిరౌలిలో 15 మంది భద్రతా సిబ్బంది మరణించిన దాడులకు పథకరచన చేశారనే అభియోగాలు ఉన్నాయి.


👉 ఆంధ్రప్రదేశ్​లోని అరకులో తెలుగుదేశం పార్టీ నేత కిడారి సర్వేశ్వరరావు హత్య వెనక నంబాల కేశవరావు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. జీరామ్ ఘాటి దాడిలో చత్తీస్‌గఢ్‌ మాజీమంత్రి మహేంద్ర కర్మ, ఛత్తీస్​గఢ్ కాంగ్రెస్ నేత నంద్‌కుమార్‌పటేల్ సహా 27 మంది మరణించిన దాడికి ఆయనే సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి.


👉 గెరిల్లా యుద్ధం, ఐఈడీల వినియోగంలో సిద్ధహస్తుడిగా పేరొందిన కేశవరావు భద్రతా బలగాలకు సవాలుగా మారారు. దేశ దర్యాప్తు సంస్థలు ఆయన పేరును మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో ఆయనపై ₹ 1 -50 కోట్లు ( కోటిన్నర రూపాయల ) రివార్డు ఉంది.


👉 2024 ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో మావోయిస్టులను హతమార్చగా ఆ ఏడాది చేపట్టిన అనేక ఆపరేషన్లలో కేశవరావు కోసం విస్తృతంగా గాలించాయి.

ఎన్కౌంటర్ లో హతమైన నంబల కేశవరావు


👉 ఛత్తీస్‌గఢ్‌ – తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో గుర్తించిన మావోయిస్టుల బంకర్‌లో కేశవరావు ఉండొచ్చని అనుమానంతో భద్రతా బలగాలు విస్తృత గాలింపు చేపట్టాయి. కొంతకాలం నుంచి కేశవరావు ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వస్తుండగా ఇప్పుడు భద్రతా బలగాలతో ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.