👉 తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో !
J.SURENDER KUMAR,
గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటం అనుచితమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని లేఖలో ప్రస్తావించింది.
👉 రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చించేందుకు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ బుధవారం (16 వ తేదీ) రోజున ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బనకచర్లను ఎజెండాగా చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచర్లపై చర్చించాల్సిన అవసరం ఏమాత్రం లేదని, వెంటనే ఆ ఎజెండాను సవరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.
👉 గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఉన్న అభ్యంతరాలు అన్నింటినీ ప్రభుత్వం లేఖలో ప్రస్తావించింది. రేపటి సమావేశంలో బనకచర్ల (Banakacharla) పై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండాను కేంద్రానికి పంపించింది. స్పందించిన తెలంగాణ కేంద్రానికి ఈ మేరకు లేఖ రాసింది.
👉 ఇప్పటికే కృష్ణాపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏఐబీపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో కూడిన ఎజెండా ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పంపించింది.
👉 బనకచర్లపై జీఆర్ఎంబీ (GRMB), సిడబ్ల్యూసీ (CWC), ఈఏసీ (EAC) తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటివరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవు. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదనే వాదనను ఈ లేఖలో ప్రస్తావించింది.
👉 ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ ను కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని ఈఏసీ తిరస్కరించిన విషయాన్ని ఈ లేఖలో ఉటంకించింది. కేంద్ర జల సంఘం కూడా ప్రీ- ఫీజిబులిటీ రిపోర్టును తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని కోరారు.
👉 రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చను వాయిదా వేయాలని, తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను అజెండాలో చేర్చాలని లేఖలో విజ్ఞప్తి చేసింది.