J.SURENDER KUMAR,
ప్రజాభవన్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంగళవారం సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సంక్షేమ వసతి గృహాలు మరియు గురుకులాల్లో విద్యార్థుల సంక్షేమం, సౌకర్యాల మెరుగుదల కోసం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

👉 సంక్షేమ వసతి గృహాలు మరియు గురుకులాల్లో అధికారుల పర్యటనల కోసం పకడ్బందీ క్యాలెండర్ రూపొందించాలని ఆదేశం. ఈ క్యాలెండర్లో ఏ అధికారి, ఏ రోజు ఏ హాస్టల్ను సందర్శించారు, ఏ అంశాలను పరిశీలించారు వంటి వివరాలను నమోదు చేయాలి. ఈ పర్యటనలు నిరంతరం కొనసాగాలని, మంత్రులు మరియు స్థానిక ఎమ్మెల్యేలను కూడా ఈ సందర్శనలకు ఆహ్వానించాలని సూచన.
👉 సంక్షేమ వసతి గృహాలు అద్దె భవనాల్లో ఉన్నట్లయితే, ఆ భవనాల సౌకర్యాలు, యజమానుల వివరాలతో కూడిన సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశం. అన్ని హాస్టల్స్లో దోమ తెరలు ఏర్పాటు చేయడం,రన్నింగ్ వాటర్ సప్లైలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.
👉 సంక్షేమ హాస్టల్స్ మరియు గురుకులాల్లోని విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, హెల్త్ కార్డులు రూపొందించాలి.ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారులతో సమన్వయం చేసుకొని వేగంగా పూర్తి చేయాలి. విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే, కార్పొరేట్ ఆసుపత్రులతో ఆన్లైన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేయాలి.
👉 ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల సంక్షేమం కోసం 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలను పెంచాం. డాక్టర్ల సూచనల మేరకు పకడ్బందీ మెనూ ఖరారు చేశాం. ఈ మెనూ అన్ని హాస్టల్స్లో ప్రముఖంగా కనిపించేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలి.

👉 రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ అవసరాలను తీర్చుకునే ప్రణాళికలు రూపొందించాలి. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అమలు, సొసైటీల వారీగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రగతిపై సమావేశంలో సమీక్షించారు.
👉 ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని, సాంఘిక సంక్షేమ శాఖ డిడి క్షితిజ, మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ షఫీ, బీసీ గురుకుల సెక్రెటరీ సైదులు, ఎస్టీ గురుకుల సెక్రెటరీ సీతా లక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.