తిరుమల శ్రీవారికి ఇంటిని విరాళంగా ఇచ్చిన దంపతులు !

👉 స్వర్గీయ భాస్కర్ రావు స్ఫూర్తితో ..


J  SURENDER KUMAR,

స్వర్గీయ భాస్కర్ రావు స్ఫూర్తితో హైదరాబాద్ కు చెందిన దంపతులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి తమ ఇంటిని విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్ మల్కాజ్ గిరిలోని వసంతపురి కాలనీకి చెందిన శ్రీమతి టి.సునీత దేవి, టి.కనక దుర్గ ప్రసాద్ దంపతులు ₹ 18.75 లక్షల విలువైన 250 చదరపు గజాల గల తమ ఇంటిని మంగళవారం విరాళంగా ఇచ్చారు.

హైదరాబాద్ కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ  భాస్కర్ రావు ఇటీవల తన మరాణానంతరం వీలునామా ద్వారా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ₹.3 కోట్లు విలువైన ఇంటిని,  ₹ 66 లక్షల బ్యాంకులోని ఫిక్సిడ్ డిపాజిట్లను టీటీడీకి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

భాస్కర్ రావు స్ఫూర్తితో శ్రీమతి టి.సునీత దేవి, శ్రీ టి.కనక దుర్గ ప్రసాద్ దంపతులు తమకు సంతానం లేకపోవడంతో తమ తదనంతరం తమ ఆస్తి శ్రీవారికి చెందేలా వీలునామా రాసి స్వామివారిపై అపారమైన భక్తిని చాటుకున్నారు. ఆస్తికి సంబంధించిన పత్రాలను తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.

ఈ సందర్భంగా స్వామివారిపై అపారమైన భక్తితో తమ ఇంటిని విరాళంగా ఇవ్వడం ఇతర భక్తులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని దాతలను అదనపు ఈవో అభినందించారు.