జర్నలిస్టు అనే పదానికి అర్థం తెలుసుకోవలసిన పరిస్థితి ఉంది!

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించడంలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నడిచే పత్రికల పాత్ర మరువలేనిది. ఇప్పుడు పాత్రికేయ రంగంలో కొన్ని వింత పోకడలు వచ్చాయి. తమ సంపాదనను కాపాడుకోవడానికి, వారిని ప్రశ్నిస్తున్న వారి పట్ల అసహ్యకర భాషను ఉపయోగించి ప్రత్యర్థుల ప్రతిష్టను దెబ్బతీయడానికి కొన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మీడియా సంస్థలు రావడం వల్ల జర్నలిస్టు అనే పదానికి అర్థం తెలుసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.


👉 నవ తెలంగాణ దినపత్రిక 10 వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి  ప్రసంగించారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి స్ఫూర్తినిచ్చే పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే ఉంటాయని, అలాంటి కోవలో నవ తెలంగాణ ఒకటని ఈ సందర్భంగా అభినందించారు.

👉 జర్నలిస్టు ముసుగులో రాజకీయ పార్టీల కోసం ముందుకొస్తున్న వారిపట్ల సమాజం నిశితంగా గమనించాలి. అలాంటి వారు వేరన్న విషయాన్ని అసలు సిసలైన జర్నలిస్టులు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.


👉 నిబద్ధత కలిగిన జర్నలిస్టులు ఈ వింత పోకడలపై సదస్సులు నిర్వహించి నిజమైన జర్నలిస్టులు ఎవరన్నది నిర్వచనం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనల పట్ల ప్రజల్లో విశ్వసనీయత తగ్గుతున్న క్రమంలో జర్నలిస్టు కూడా అదే దారిలో వేగంగా పరుగెత్తుతున్నారు సీఎం అన్నారు.


👉 స్వతంత్ర సంగ్రామ కాలంలో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి అందరినీ ఒక వేదికపైకి తేవడంలో పత్రికలు అపారమైన కృషి చేశాయని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు కొన్ని వింత పోకడలు పాత్రికేయ రంగానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.


👉 “కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని పత్రికలు ప్రజల పక్షాన నిలబడి చైతన్యం చేయడంలో విశేష కృషి చేశాయి. అందరికీ ఆదర్శంగా నిలబడ్డాయి. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంతో పాటు బాల్య వివాహాలు, కులాల మధ్య అంతరాలు, జోగినీ వ్యవస్థ.. వంటి సమాజంలోని అనేక రుగ్మతలపై ప్రజలను చైతన్యం చేశాయి అన్నారు.


👉 నిజమైన జర్నలిస్టులకు, ఆ ముసుగులో వస్తున్న వారికి మధ్య ఒక లక్ష్మణ రేఖను గీయాల్సిన అవసరం ఉంది. ఆ పని జరక్కపోతే పత్రికలకే కాదు, దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడుతుంది. జర్నలిస్టుల ముసుగు తొడుక్కుని విద్రోహ చర్యలకు పాల్పడిన సంగతి ఇటీవల ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కొందరిని అరెస్టు చేసిన ఘటనల్లో వెలుగులోకి వచ్చాయి.


👉 సామాజిక స్థితిగతులను అర్థం చేసుకోవడం, సంక్షేమ పథకాల్లో లోటుపాట్లను సరిదిద్దుకోవడంతో పాటు పరిపాలనలో పట్టు సాధించాలంటే పత్రికల్లో విశ్లేషణాత్మక కథనాలు ఎంతో అవసరం. తప్పులు జరక్కుండా పరిపాలన అందించాలన్న ఉద్దేశంతో అలాంటి వాటిని నేనెప్పుడూ గమనిస్తూనే ఉంటా.


👉 అబద్దాల పునాదులపైన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటే అది ఏదో ఒకరోజు కూలుతుందని విశ్వసించే వాడిని…” అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సందర్భంగా నవ తెలంగాణ ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.


👉 ఈ కార్యక్రమంలో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సిహెచ్ ప్రియాంక , సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, నవ తెలంగాణ సాహితీ సంస్థ ఇంచార్జి తమ్మినేని వీరభద్రం , సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ , మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి , చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ , పత్రిక సంపాదకులు రాంపల్లి రమేష్ తో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.