👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కాలేజీల్లో విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్ రికగ్నేషన్ తప్పనిసరి చేయాలని చెప్పారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగుపడటంతో పాటు లోటుపాట్లను అరికట్టవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
👉 పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన విద్యా బోధన, బోధనలో నాణ్యతా ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి ఆదేశించారు.
👉 ఐసీసీసీ ఇంటిగ్రేటెడ్ కమాన్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)
లో ముఖ్యమంత్రి విద్యా శాఖలపై శుక్రవారం సీఎం సమీక్షించారు.
👉 విద్యా శాఖ పరిధిలో అదనపు గదులు, వంట గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహారీల నిర్మాణం వివిధ విభాగాలు చేపట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.
👉 ఈ నిర్మాణాల నాణ్యత ప్రమాణాలు, నిర్మాణ పర్యవేక్షణ, నిధుల మంజూరు, జవాబుదారీతనానికి గానూ ఒకే విభాగం కింద ఉండాలన్నారు.
👉 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ (EWIDC) కిందనే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల నిర్మాణాలు కొనసాగాలని ఆదేశించారు.

👉 ఈ సంస్థకు అవసరమైన ఇంజినీరింగ్, ఇతర సిబ్బందిని ఇతర విభాగాల నుంచి వెంటనే డిప్యూటేషన్పై తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.
👉 మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛానల్లో చేపట్టాలి. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం చూపొద్దు.
👉 తెలంగాణలోని మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి.
👉 కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్యమివ్వాలి. వాటిపై సోలార్ ప్యానెళ్లతో అవసరమైన విద్యుత్ వినియోగించుకోవచ్చు.
👉 ప్రతి పాఠశాలలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిన వ్యాయామ ఉపాధ్యాయులను నియమించే అంశాన్ని పరిశీలించాలి.
👉 అమ్మ ఆదర్శ పాఠశాలల కింద పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులకు సంబంధించిన బిల్లులు తక్షణమే విడుదల చేయాలి.
👉 సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని బాలికలకు వివిధ అంశాలపై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మహిళా కౌన్సెలర్లను నియమించాలి.
👉 విద్యా రంగంపై పెడుతున్న ఖర్చును తాము ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
👉 యంగ్ ఇండియా ఇంటెగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్లతో పాటు విద్యా రంగం అభివృద్ధికి తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిమితిలో లేకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారని తెలిపారు.
👉 ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న వారిలో 90 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారని, ఈ విషయాన్ని నిర్ధారించేందుకు గత పదేళ్లలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారి వివరాలపై నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
👉 ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేములు శ్రీనివాసులు, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా , ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి , సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.