👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
హైదరాబాద్ నగరానికి క్లీన్ ఇమేజీ తీసుకొచ్చేందుకు అధికారులు నిరంతరం శ్రమించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. క్లీన్ సిటీగా రూపొందించే ప్రణాళికలు అమలు చేసే అధికారులకు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు.
తెలంగాణ రైజింగ్ కోర్ – అర్బన్ ఏరియా అభివృద్ధికి సంబంధించి వివిధ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం సంబంధిత శాఖలు, విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షించారు.
👉 తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ సిటీ ఏరియాను గ్లోబల్ సిటీకి చిరునామాగా సమగ్రమైన ప్రణాళికతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. మానవ జీవన ప్రమాణాలకు కొలమానమైన విద్య, వైద్యం, రోడ్డు రవాణా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.

👉 నగర విస్తరణలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు గ్రేటర్ సిటీకి లక్షలాది కుటుంబాలు వలస వస్తున్నాయని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.
👉 హైదరాబాద్ను ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దడంతో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలు చేయాల్సిన ప్రణాళికలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరిస్తూ, అధికారులకు పలు సూచనలు చేశారు.
👉 కోర్ అర్బన్ సిటీ అభివృద్ధిలో భాగంగా అందరికీ ప్రాథమిక విద్యను అందించే సంస్కరణలు ముందుగా అమలు చేయాలి. అందుకు జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కాలేజీలన్నింటినీ గుర్తించాలి.
👉 నర్సరీ నుంచి 4 వ తరగతి వరకు, 5 నుంచి 8 వ తరగతి వరకు, 9 నుంచి ఇంటర్ వరకు 3 కేటగిరీలుగా అందరికీ నాణ్యమైన విద్యను అందించాలి. నర్సరీ నుంచి 4వ తరగతి స్కూళ్లపై ముందుగా ఫోకస్ చేయాలి. ప్రభుత్వ స్థలాలు, ఇటీవల కబ్జాలు, ఆక్రమణల నుంచి విముక్తి పొందిన ప్రభుత్వ భూముల్లో స్కూళ్లకు అధునాతన భవనాలు నిర్మించాలి. పాఠాశాలలకు సంబంధిత ప్రణాళికను విద్యా శాఖ వెంటనే సిద్ధం చేసి అమలు చేయాలి.
👉 కోర్ అర్బన్ సిటీలో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఉండాలి. వాటికి అవసరమైన స్థలాలు కేటాయించి, ప్రాధాన్య క్రమంలో భవనాలు నిర్మించే ప్రణాళిక తయారు చేయాలి. సచివాలయంతో పాటు నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలన్నీ పునరుత్పాదక విద్యుత్తును మాత్రమే వినియోగించాలి. వెంటనే కార్యాలయాలపై సోలార్ విద్యుత్తు ప్లాంట్లను అమర్చాలి.
👉 నాలాలు, కుంటలు, చెరువుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు డిజిటల్ ల్యాండ్ డేటాబేస్ విధానం అమలు చేయాలి.
👉 నగరంలో ట్రాఫిక్ నియంత్రణ సమర్థంగా జరిగేందుకు అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నగరంలో ఉన్న అన్ని జంక్షన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలి. గూగుల్ సహకారంతో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించే ప్రణాళిక పోలీసు విభాగం వెంటనే అమలు చేయాలి.
👉 కోర్ అర్బన్ సిటీలో మున్సిపల్, పోలీస్, విద్యుత్, జలమండలి విభాగాల యూనిట్లు, వాటిని పర్యవేక్షించే అధికారుల పరిధి ఒకేతీరుగా ఉండాలి. నగరంలో డ్రైనేజీ, మ్యాన్హోల్స్ క్లీనింగ్ కోసం రోబోటిక్ యంత్రాలను వాడాలి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానం తరహాలో మూసీ పరివాహకంలో ఉన్న అంబర్పేట్ స్మశాన వాటికను అధునాతనంగా అభివృద్ధి చేయాలి.
👉 హుస్సేన్ సాగర్ చుట్టూ నెక్లెస్ రోడ్, ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్ ప్రాంతాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలి. ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా హుస్సేన్ సాగర్ 2.0 ను అన్ని హంగులతో అభివృద్ధి చేయాలి. స్కై వాక్, సైకిల్ ట్రాక్తో పాటు మల్టీ లెవల్ పార్కింగ్ను, పర్యాటకులను ఆకట్టుకునే నిర్మాణాలు చేపట్టాలి. కోర్ అర్బన్ సిటీలో ఉన్న పార్కులన్నింటినీ పిల్లలను ఆకట్టుకునేలా, ఆహ్లాదంగా ఉండేలా అభివృద్ధి చేయాలి.

👉 వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్స్ను ఏర్పాటు చేయాలి. బహుళ అంతస్తుల భవనాల్లో ఫైర్ సేఫ్టీ అంశాలపై అత్యంత పకడ్బందీ వ్యవస్థ ఉండాలి. వీధి దీపాలకు సోలార్ విద్యుత్ వినియోగం, కొత్తగా పునరుద్ధరిస్తున్న చెరువుల వద్ద పైలట్ ప్రాజెక్టుగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలి.
👉 డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు అమలు చేయాలి. డ్రగ్స్, గంజాయి సేవించి పట్టుబడితే బాధితులుగా చూడవద్దని, కనీసం పది రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచాలి. చర్లపల్లి జైలు ప్రాంగణంలోనే ఈ రీహాబిలిటేషన్ సెంటర్ నిర్మించాలి.. అని ముఖ్యమంత్రి వివరించారు.
👉 ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , డీజీపీ జితేందర్ తో పాటు ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
👉 ఈ సమావేశంలో కోర్ అర్బన్ సిటీ అభివృద్ధి ప్రణాళికను అయిదు ప్రధాన అంశాలుగా విభజించి, మొత్తం 111 ప్రతిపాదనలను స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.