👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
క్రైస్తవ మైనార్టీల అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
శుక్రవారం సికింద్రాబాద్ వైఎంసీఏలో వైఎంసీఏ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మల్టీపర్పస్ ప్రోగ్రామ్ సెంటర్, నూతన ఆడిటోరియం శంఖుస్థాపన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
క్రైస్తవ మైనార్టీలకు రావలసిన నిధులు, సంక్షేమ పథకాలు, పదవుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి వర్గానికి న్యాయం చేస్తూ ముందుకు సాగుతోందని అన్నారు. గత ప్రభుత్వాలు ఈ వర్గం సమస్యలను విస్మరించాయని, కాని తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే వాటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టినట్లు వివరించారు.

మైనార్టీ శ్మశాన వాటికలు, వారికి కేటాయించిన భూములపై పెండింగ్లో ఉన్న సమస్యలను క్లియర్ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఈ భూములు ఎటువంటి కబ్జాలకు గురికాకుండా ఫెన్సింగ్తో రక్షణ కల్పించి, అవసరమైన సౌకర్యాలను అందించాలని సూచించినట్లు తెలిపారు. బడ్జెట్ కేటాయింపులో క్రైస్తవ మైనార్టీలకు సముచిత స్థానం ఇస్తామని, పాస్టర్లకు, చర్చిలకు, సేవా సంస్థలకు తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల కోసం స్కాలర్షిప్ నిధులు పెంచి, ప్రత్యేక వసతులు కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పేద క్రైస్తవ కుటుంబాలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, సబ్సిడీలు అందిస్తున్నామని వివరించారు.

తన చిన్ననాటి నుంచి వైఎంసీఏతో అనుబంధం ఉందని, నారాయణగూడ మైదానంలో క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. విద్యార్థి దశలో సింగపూర్ పర్యటన సమయంలో అక్కడ వైఎంసీఏలో బస చేసిన అనుభవాన్ని మంత్రి పంచుకున్నారు. వైఎంసీఏ ఐకమత్యానికి ప్రతీక అని, దానిని మరింత అభివృద్ధి చేయడం అందరి బాధ్యత అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న అత్యుత్తమ సంస్థల్లో వైఎంసీఏ ఒకటని, దాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న అధ్యక్షులు జయకర్ డేనియల్ను అభినందించారు.

ఈ సందర్భంగా వైఎంసీఏ చైర్మన్గా సేవలందించిన మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ దీపక్ జాన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, మంత్రి అడ్లూరి సతీమణి శాంతికుమారి, కార్పొరేటర్, కొంతం దీపిక, సుప్రీంకోర్టు న్యాయవాది జోయ్స్, బిషప్ సింగం, లెనార్డ్ తదితరులు పాల్గొన్నారు.