👉 మీడియా అకాడమి చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి !
J.SURENDER KUMAR,
పేదరికంలో జీవిస్తున్న, బలమైన కుటుంబ నిర్మాణం లేని, తక్కువ విద్య ఉన్న దిగువ సామాజిక వర్గాల వారిని లక్ష్య్రంగా చేసుకుని కొన్ని ముఠాలు మానవ అక్రమ రవాణా చేసి వారి చేత వెట్టి చాకిరి చేయిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
మంగళవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో “హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు బాండెడ్ లేబర్” అంశాలపై తెలంగాణ మీడియా అకాడమీ మరియు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (IJM) సంయుక్తంగా వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో మానవ అక్రమ రవాణా సమాజంలో అత్యంత దుర్బల వర్గాల వారిపై ప్రభావం చూపుతుందన్నారు. బాధితుల్లో సగానికి పైగా బలవంతపు లేదా బాండెడ్ లేబర్లో ఉన్నారని, వారంతా వారు ఇటుక బట్టీలు, గృహా నిర్మాణం, ప్రాజెక్టు పనులు, బహుళ అంత్తసులలో పనులు, వస్త్ర కర్మాగారాలు, వ్యవసాయం లేదా రాతి గనులలో రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేస్తున్నారని అలాంటి వారిని గుర్తించి మీడియా ప్రతినిధులు రిపోర్టింగ్ ద్వారా ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.
వారంతా దళారుల చేత మోసగించినవారై అన్నారు. దళారులు వారికి కూలి పని కల్పిస్తామని ముందుగానే అత్యధిక డబ్బులు ఆశ చూపి వడ్డీ ద్వారా అప్పులు సమకూర్చి వారి జీవితాలను, వారి కుటుంబాలను చిన్నా భిన్నం చేస్తున్నారని ఆయన అన్నారు.

వీరిని ఆయా యజమానులు మనుషులలాగా కాకుండా కేవలం వస్తువులుగా చూస్తూ, ఇసడించుకుని తక్కువ స్థాయి వ్యక్తులుగా ముద్రవేసి వారి జీవితాలను చెరిపెస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
దశాబ్ద కాలంగా కొన్ని కుటుంబాలు తరతరాలుగా బంధించబడిన శ్రమను అనుభవిస్తాయని వారికి విముక్తి కలిగేలా చూడాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు.
మరణించిన కార్మికుల అప్పులు వారి పిల్లలు, తోబుట్టువులు, తల్లిదండ్రులకు బదిలీ చేసి ఇంకా వేదిస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. గృహ పని మరియు నిర్మాణం వంటి తక్కువ నైపుణ్యం కలిగిన రంగాలలో పని కోరుకునే భారతీయ వలసదారులు వివిధ దేశాలకు వలసల పేరుతో కార్మికులు అక్రమ రవాణాలో చిక్కుకుంటున్నారని తెలిపారు.
ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజేఎం) ఎన్జీవోల బృందం మానవ అక్రమ రవాణా నేరాలకు సంబంధించిన దర్యాప్తు ఆధారాలను సేకరించడం, ప్రాణాలతో బయటపడిన వారిని విడిపించడం, అక్రమ రవాణాదారులను అరెస్టు చేయడంలో పోలీసులకు సహాకారం అందించి బాధితులకు తగు న్యాయం చేసేలా కృషి చేస్తోందని ఆ బృందం సభ్యులు ఈ శిక్షణలో బోధించారు.
కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, IJM మీడియా కమ్యూనికేషన్స్ అధిపతి ప్రియా అబ్రహాం, IJM ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.