👉 జాతర ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో సమీక్ష !
J.SURENDER KUMAR,
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం ఆదివాసీ గిరిజన జాతరను మరింత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు జాతర ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న ముఖ్యమంత్రి మంగళవారం ప్రత్యక్షంగా మేడారం క్షేత్ర స్థాయి సందర్శించనున్నారు.
👉 మేడారం జాతర కోసం గతంలో తాత్కాలిక ఏర్పాట్లు జరిగేవి. మేడారం ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనుల కోసం వంద రోజుల కార్యాచరణను నిర్ధేశించిన ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నారు. మేడారం పూజరులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై మేడారంలో సమీక్షిస్తారు.
👉 ఆదివాసీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ఇలవేల్పులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
👉 కోట్లాది భక్తులు వచ్చే జాతర ప్రాశస్త్యానికి తగ్గట్లు భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం.. గద్దెల దర్శనం, బంగారం (బెల్లం) సమర్పణ.. జంపన్న వాగులో స్నానాలు ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు.
👉 మేడారం అభివృద్ధి పనుల్లో గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు ఎటువంటి భంగం కలగవద్దనే కృతనిశ్చయంతో ఉన్న ప్రజా ప్రభుత్వం ప్రతి నిర్మాణం, ప్రతి కట్టడాన్ని పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా, మేడారం జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతో ప్రభుత్వం చేపట్టనుంది.
👉 నిర్మాణాల్లో విలువైన గ్రానైట్, లైమ్స్టోన్ రాళ్లను వాడనున్నారు. పురాతన ఆలయాల పునఃనిర్మాణం, ప్రసిద్ధ ఆలయాల అభివృద్ధి పనుల్లో ప్రసిద్ధుడైన స్తపతి ఈమని శివనాగిరెడ్డి సేవలను మేడారం అభివృద్ది పనులకు ప్రభుత్వం వినియోగించుకుంటోంది.
👉 గతంలో ముఖ్యమంత్రులు, మంత్రులు జాతరకు వెళ్లడం, దర్శనాలతో సరిపుచ్చేవారు. ఈసారి అందుకు భిన్నంగా ప్రపంచ పటంలో జాతరకు మరింత వన్నె తేవాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. ఆదివాసీల సంప్రదాయాలు, ఆకాంక్షలకు అద్దంపట్టేలా మేడారం జాతరను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని ఇటీవలే అధికారులను ఆదేశించారు.
👉 రెండేళ్లకోసారి జరిగే మహా జాతరతో పాటు ఏడాది పొడవునా అన్ని రోజుల్లో మేడారం వచ్చి గద్దెలను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. వారాంతం, ఇతర సెలవు దినాల్లో ఈ రద్దీ మరింత పెరుగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన వసతి, సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది.
👉 మేడారం అభివృద్ధి పనులతో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేయటంతో పాటు ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రభుత్వం ఊతమివ్వనుంది. ఫలితంగా మేడారం సమీపంలో ఉన్న రామప్ప, ఇతర ఆలయాలకు భక్తుల సంఖ్య పెరిగి స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.