J.SURENDER KUMAR,
తెలంగాణలో పెట్టుబడులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. పర్యాటక రంగంలో ప్రపంచంలో సమున్నత స్థానంలో నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. పెట్టుబడులకు, పర్యాటకులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామని చెప్పారు.
👉 ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజున శిల్పారామం, సంప్రదాయ వేదికలో ‘టూరిజం కాంక్లేవ్ -2025’ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు జూపల్లి కృష్ణారావు , వాకిటి శ్రీహరి , సలహాదారు వేం నరేందర్ రెడ్డి ల తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా పర్యాటక రంగంలో వివిధ ప్రాజెక్టులపై ప్రభుత్వంతో కుదిరిన ఎంఓయూలను ముఖ్యమంత్రి సమక్షంలో అందజేశారు.

👉 ఈ సందర్భంగా కాంక్లేవ్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పదేళ్లుగా పర్యాటక రంగంలో రాష్ట్రానికి ప్రత్యేక విధానం లేదు. మా ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించడమే కాకుండా మొట్టమొదటి తెలంగాణ టూరిజం కాంక్లేవ్ -2025 నిర్వహించడం అభినందనీయం.
👉 వివిధ టూరిజం ప్రాజెక్టుల కోసం 15 వేల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులను ఆకర్షించాం. టూరిజం రంగంలో పెట్టుబడులకు తెలంగాణలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందుకే, అధికారులు ఈ ఏడాది ₹50 వేల కోట్ల మేరకు పెట్టుబడులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.
👉 హైదరాబాద్ నగరంలో చార్మినార్, గోల్కొండ లాంటి ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. టైగర్ రిజర్వు, కవాల్ టైగర్ రిజర్వ్, వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంతో పాటు, వేయి స్తంభాల గుడి, ఆలంపూర్ శక్తి పీఠాలు.. ఇలా చెప్పుకుంటూపోతే అనేక ప్రత్యేకతలున్న ప్రాంతాలున్నాయి.
👉 తెలంగాణలో అత్యుత్తమ, సాంస్కృతిక పర్యాటక ప్రాంతాలున్నాయి. అందుకే ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, టెంపుల్ టూరిజం ఇలా అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నాం. గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు. ఒరిజినల్ సిటీ. ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఐటీ, ఫార్మా రంగాలే కాదు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలి.
👉 ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించాం. హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరం. పెట్టుబడులు, పర్యాటకుల రక్షణ విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుంది.” అని ముఖ్యమంత్రి చెప్పారు.
👉 ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తెలంగాణ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ డీజీపీ జితేందర్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
👉 టూరిజం రంగంలో ఉత్తమ సేవలు అందించిన వివిధ సంస్థలకు ఈ కార్యక్రమంలో అవార్డులను బహూకరించారు.