👉 కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి !
J.SURENDER KUMAR,
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
👉 ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో నివాసంలో బుధవారం సమావేశమయ్యారు. మూసీ, ఈసా నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టనున్న ప్రణాళికపై ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కి సమగ్రంగా వివరించారు.
👉 ఈ రెండు నదుల సంగమ స్థలంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపడతామని, ఇందుకు అక్కడ ఉన్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా ప్రతిష్టాత్మకంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

👉 గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్, ఘాట్లు, శాంతి విగ్రహం మ్యూజియం నిర్మిస్తామని వివరించారు.
👉 రాజ్నాథ్ తో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి తో పాటు ఎంపీలు పొరిక బలరాం నాయక్ , చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య , మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇవి నరసింహారెడ్డి , కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.