👉 ప్రతి కార్మికుడికి దాదాపు ₹ 2 లక్షల ప్రయోజనం !
👉 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పన్నులు పోగా సింగరేణి ₹ 6,394 కోట్ల మేరకు లాభాలు !
👉 సింగరేణి లాభాల్లో 34 శాతం మేరకు ₹ 819 కోట్ల బోనస్ !
J.SURENDER KUMAR,
సింగరేణి లాభాల్లో 34 శాతం మేరకు ₹ 819 కోట్ల రూపాయలను బోనస్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రకటించారు. తాజాగా ప్రకటించిన బోనస్ వల్ల ప్రతి కార్మికుడికి ₹ 1,95,610 రూపాయల చొప్పున ప్రయోజనం చేకూరనుంది. గతేడాది తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకూ ₹ 5 వేల చొప్పున బోనస్ అందజేయగా, ఈసారి ₹ 5,500 చొప్పున బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు.
దసరా పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు వరుసగా రెండో ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. గడిచిన ఏడాది కాలంలో సింగరేణి సంస్థ ఉత్పత్తి, గడించిన లాభాలు, సాధించిన విజయాల ఆధారంగా కార్మికులకు 34 శాతం మేరకు బోనస్ ప్రకటించారు.
👉 సింగరేణి కార్మికులకు బోనస్ అందించాలన్న అంశంపై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్ , మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో పాటు ఇతర మంత్రులు, సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

👉 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పన్నులు పోగా సింగరేణి ₹ 6,394 కోట్ల మేరకు లాభాలను గడించగా, అందులో సింగరేణి సంస్థ విస్తరణకు ₹ 4,034 కోట్లు కేటాయించారు. మిగిలిన ₹ 2360 కోట్లను వివిధ రూపాల్లో కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించడంతో పాటు, అందులో 34 శాతం మేరకు బోనస్ ప్రకటించారు. మొత్తంగా దాదాపు 71 వేల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది.
👉 దసరా పండుగను పురస్కరించుకుని ఈ బోనస్ ప్రకటించగా దీపావళి పండుగ సందర్భంలో బోనస్కు సంబంధించి మరో ప్రకటన చేస్తామని తెలియజేశారు. సింగరేణి అభివృద్ధిలో సహకరించిన కార్మిక సంఘాలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు

👉 తెలంగాణ సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికుల త్యాగం, శ్రమ, చరిత్ర ఎప్పటికీ మరువలేమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న దశలో బొగ్గు ఉత్పత్తిని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషించారని అన్నారు. తెలంగాణలో వారి భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ఎప్పుడూ గుర్తిస్తూనే ఉంటుందని చెప్పారు.
👉 బొగ్గు గనుల ద్వారా సింగరేణి మొత్తం జాతికే వెలుగులు అందిస్తోందని, దేశంలో పరిశ్రమలు లాభసాటిలో నడుస్తున్నాయంటే కార్మికుల శ్రమ ఎంతో ఉందన్నారు. అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు లాభాల్లో వాటాలను పంచాలని నిర్ణయించామని అన్నారు.

👉 శ్రమ శక్తిని నమ్ముకున్న కార్మికులకు లాభాల్లో వాటాలను పంచడంతో పాటు సంస్థ భవిష్యత్తు ప్రణాళికలు, విస్తరణ కార్యక్రమాలు, కార్పొరేట్ రంగంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కార్మికుల సంక్షేమం, అభివృద్ధి సాధించే దిశగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
👉 సింగరేణి సంస్థ కార్పొరేట్ రంగంతో పోటీ పడి తలెత్తుకునేలా భవిష్యత్తు పెట్టుబడులు, ప్రణాళికలతో ముందుకు వెళ్లే విషయంలో కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి , ఇతర మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు.
👉 గత ప్రభుత్వ హయాంలో టెండర్లలో పాల్గొనకపోవడం వల్ల కోల్పోయిన రెండు గనులను తిరిగి సింగరేణి ఆధ్వర్యంలోకి తీసుకొచ్చే విషయంలో అన్ని మార్గాలను అన్వేషిస్తామని స్పష్టం చేశారు.
👉 ప్రస్తుత పోటీ ప్రపంచంతో సింగరేణి కూడా పోటీ పడుతుందని, ఆయాచిత లబ్ది కోసం ప్రయత్నించడం లేదని ముఖ్యమంత్రి చెప్పారు. సింగరేణి మనుగడ, లాభాల ఆర్జన, ప్రపంచంతో పోటీ పడటం వంటి కీలక అంశాలపై కార్మికులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమాలోచనలు చేసి పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు పోతామని చెప్పారు.

👉 జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో రాష్ట్రం దాదాపు ₹ 7 వేల కోట్ల మేరకు ఆదాయం కోల్పోతోంది. ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. జీఎస్టీ (GST) సవరణలతో ఏర్పడిన వ్యత్యాసాన్ని పూరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారని చెప్పారు.
👉 మీడియా సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , గడ్డం వివేక్ వెంకటస్వామి, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , షబ్బీర్ అలీ , హర్కర వేణుగోపాలరావు, ఎంపీలు పోరిక బలరాం నాయక్ , రామసహాయం రఘురామిరెడ్డి, సింగరేణి ప్రాంత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సింగరేణి కాలరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.