👉 పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా సదస్సులో..!
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!
J.SURENDER KUMAR,
ప్రపంచంలో అగ్రభాగాన నిలపాలన్న బృహత్తరమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు. తెలంగాణలో పెట్టే పెట్టుబడులకు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని, అవసరమైన భద్రత ఉంటుందని స్పష్టం చేశారు.
👉 ప్రతిష్టాత్మక పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో శుక్రవారం జరిగిన వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాల్లో ప్రగతి లక్ష్యాలపై తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఈ ఏడాది డిసెంబర్ 9 న ఆవిష్కరించబోతున్నట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
👉 లక్ష్య సాధన దిశగా పయనిస్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు.

👉 “పారదర్శకమైన పరిపాలన అందించడానికి రాజకీయ సంకల్పం కావాలి. భవిష్యత్ తరాలకు అవకాశాలను సృష్టించాలన్నదే మా ఆలోచన. దేశంలోనే యువ రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ తెలంగాణకు, హైదరాబాద్కు ఘనమైన చరిత్ర ఉంది.
👉 రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 రూపొందించాం. రాష్ట్రాన్ని భౌగోళికంగా మూడు ప్రాంతాలు.. కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ తెలంగాణగా విభజన చేశాం.
👉 కోర్ అర్బన్ ప్రాంతంలో కోటి మంది నివసిస్తున్నారు. కోర్ అర్బన్ ప్రాంతం సేవా రంగానికి వినియోగించాలని ఈ ప్రాంతంలోని కాలుష్య కారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలిస్తున్నాం. సెమీ అర్బన్ ప్రాంతాన్ని తయారీ రంగం కోసం ప్రత్యేక జోన్గా (మాన్యుఫాక్చర్) నిర్ణయించాం.
👉 తెలంగాణలో అభివృద్ధికి తగినట్లు 70 కి.మీ ఉన్న మెట్రోను 150 కి.మీ పొడిగించాలని నిర్ణయించాం. ప్రస్తుతం అయిదు లక్షల మంది మెట్రోలో పయనిస్తున్నారు.. దానిని 15 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సబర్మతీ తీరంలా మూసీని మారుస్తాం. అందుకు మూసీ నది పునరుజ్జీవంపై దృష్టి సారించాం.
👉 హైదరాబాద్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపడుతున్నాం. 2027 నాటికి హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా ఉండనున్నాయి. అందుకే ఈవీలకు రాయితీలు ప్రకటించాం. రాష్ట్ర అవసరాలకు తగినట్లు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం, భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ అనుసంధానత కల్పిస్తాం.
👉 తెలంగాణలో సేంద్రియ పంటలు పండుతున్నాయి. ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాలను తెలంగాణలో కఠినంగా నియంత్రిస్తున్నాం. వాటి నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.
👉 మారుతున్న కాలానికి అనుగుణంగా విజ్ఞానంతో పాటు నైపుణ్యం అవసరం. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. తమ ప్రభుత్వం మహాత్మా గాంధీ యంగ్ ఇండియా స్ఫూర్తిని అనుసరిస్తోంది. స్కిల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి.
👉 స్పోర్ట్స్లో దక్షిణ కొరియా వంటి చిన్న దేశాలకు వచ్చే మెడల్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒలింపిక్స్ పతకాల సాధనే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం.
👉 తెలంగాణకు ఓడ రేవు లేనందున, మచిలీపట్నం ఓడ రేవుతో అనుసంధానానికి ఫ్యూచర్ సిటీ నుంచి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, దానికి సమాంతరంగా రైల్వే లైన్ మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం.

👉 బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40 శాతం తెలంగాణ నుంచి జరుగుతోంది. వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ఆ దేశానికే ఎక్కువగా నష్టం చేకూర్చేలా ఉన్నాయి..” అని వివరించారు.
👉 ఈ సందర్భంగా జరిగిన చర్చా గోష్టిలో PAFI అధ్యక్షుడు చేతన్ కృష్ణ గారు, సెల్ కాన్ గ్రూప్ చైర్మన్ గురుస్వామి నాయుడు , గోద్రేజ్ కార్పొరేట్ ఎఫైర్స్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, పాల్గొన్నారు. కార్యక్రమానికి బిజినెస్ స్టాండర్డ్ ఎడిటోరియల్ డైరెక్టర్ అశోక్ భట్టాచార్య మాడరేటర్గా వ్యవహరించారు.