👉 అమెరికా ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR,
ఇటీవల అమెరికా పెంచిన సుంకాలు, హెచ్-1 బీ వీసాలపై విధించిన కఠిన నిబంధనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో అమెరికా–భారత్ మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుండటమే కాక అస్థిరత, అపార్థానికి దారి తీస్తాయని చెప్పారు. రెండు దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శంగా ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణకు వచ్చిన అమెరికా ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
👉 హడ్సన్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ప్రతినిధులు, వివిధ రంగాల మేధావులు, బిజినెస్ లీడర్లు, దాతలతో కూడిన అమెరికన్ ప్రతినిధి బృందం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి తో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పరిశ్రమలు & ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
👉 ఇండియా ఫౌండేషన్ సారధ్యంలో ఈ అమెరికన్ ప్రతినిధి బృందం భారత్లోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై అభిప్రాయాలు స్వీకరిస్తోంది.
👉 సమావేశంలో ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. పాలకులు మారినా విధానాలను మార్చవలసిన అవసరం లేదని, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఉత్తమమైన విధానాలను ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

👉 హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడుల గమ్యస్థానంగా, ప్రపంచ నగరంగా ఆకర్షణగా మారిందని, దేశీయ-విదేశీ దిగ్గజ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ ఇప్పుడు న్యూయార్క్, టోక్యో, దక్షిణ కొరియాతో పోటీ పడుతోంది, మౌలిక సదుపాయాలు మరియు తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడం ప్రపంచ ప్రమాణాలకు సవాలుగా ఉందని అన్నారు.
👉 జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందని, 2034 నాటికి ₹ 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని, 2047 నాటికి ₹ 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉందని తెలిపారు.
👉 హైదరాబాద్లో గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్, మాన్యుఫాక్చర్ జోన్లు అభివృద్ధి జరుగుతున్నాయని, డ్రై పోర్ట్ ఏర్పాటు చేసి మచిలీపట్నం పోర్ట్ వరకు 12-లేన్ గ్రీన్ ఫీల్డ్ హైవే, రైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్–చైన్నై, హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఉన్నాయని, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త మార్గాలను తెరవనున్నట్లు తెలిపారు.
👉 30,000 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వామ్యాన్ని, మద్దతును ఆహ్వానిస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయని, మొత్తం 500 కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
👉 ‘చైనా +1’ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపికగా ఉందని, భవిష్యత్తు ప్రణాళికలను ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పారు. హైదరాబాద్లో ఏఐ సిటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ప్రణాళిక ఉందని, రాష్ట్రాన్ని దేశానికి స్కిల్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనే కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
👉 పేరొందిన కంపెనీలు హైదరాబాద్లో గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఏర్పాటు చేశాయని, వీటిని గ్లోబల్ వాల్యూ సెంటర్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు, అలాగే హైదరాబాద్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ల సరఫరాలో ప్రధాన పాత్ర పోషించాయని పేర్కొన్నారు.
👉 హడ్సన్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు, వాల్ స్ట్రీట్ జర్నల్ కాలమిస్ట్ ప్రొఫెసర్ వాల్టర్ రస్సెల్ మీడ్ గారు, రేషనల్వేవ్ క్యాపిటల్ పార్టనర్స్ CEO మార్క్ రోసెన్బ్లాట్ , క్రౌ హోల్డింగ్స్ చైర్మన్ హర్లాన్ క్రో గారు, ఈగిల్ క్యాపిటల్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకుడు రావెనెల్ కరీ, బిల్లింగ్స్లీ కంపెనీ భాగస్వామి హెన్రీ బిల్లింగ్సీ సహా మొత్తం 16 మంది అమెరికా ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.