జోర్డాన్‌లో తెలంగాణ వాసులకు ప్రభుత్వం అండ !

👉 కంపెనీని సందర్శించిన ఇండియన్ ఎంబసీ అధికారులు !

👉 జోర్డాన్ కార్మిక అధికారులతో సమన్వయం చేస్తున్న ఎంబసీ !

J.SURENDER KUMAR,

జోర్డాన్‌లో కష్టాలు పడుతున్నామని తెలంగాణకు చెందిన 12 మంది కార్మికులు ఇటీవల వీడియో విడుదల చేశారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి టి. హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు కే.ఆర్. సురేష్ రెడ్డి స్పందించారు.

కార్మికుల కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆదేశాలతో, తెలంగాణ ప్రభుత్వ జిఏడి ఎన్నారై విభాగం తక్షణ చర్యలు ప్రారంభించింది.

జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖలు పంపి విషయం తెలియజేశారు. కేసును ‘మదద్’ పోర్టల్‌లో నమోదు చేశారు. జిఏడి ఎన్నారై విభాగం ఐఏఎస్ అధికారులు సయ్యద్ అలీ ముర్తజా రిజ్వి, సి.హెచ్. శివ లింగయ్య లు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు.

తెలంగాణ వాసులు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా వారి సంక్షేమం, భద్రత గురించి ముఖ్యమంతి ఏ. రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్, విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్ అన్నారు. జోర్దాన్ లో చిక్కుకున్న కార్మికుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. వలస జీవుల సమస్యను రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో చూడాలని బీఆర్ఎస్ నాయకులకు డా. వినోద్ హితవు పలికారు.

ఇండియన్ ఎంబసీ అధికారులు ‘మిల్లీనియం అగ్రికల్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్’ అనే కంపెనీని ప్రత్యక్షంగా సందర్శించి, కార్మికుల పరిస్థితిని సమీక్షించారు. మొత్తం 170 మంది భారతీయ కార్మికులలో చాలా మంది సంతృప్తిగా ఉన్నా, తెలంగాణకు చెందిన 12 మంది మాత్రమే పని చేయడానికి నిరాకరించి, భారత్‌కు వాపస్ పంపించాలని కోరుతున్నారని ఎంబసీ తెలిపింది. ఈ విషయంలో జోర్డాన్ కార్మిక మంత్రిత్వ శాఖ స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్నారు.

👉 ఇండియన్ ఎంబసీ అధికారుల నివేదిక ప్రకారం:

* కంపెనీ ప్రత్యేకంగా భారతీయ వంటకారుడిని నియమించడంతో ఆహార సమస్యలు తగ్గాయి.

* జీతాలు ఫింగర్‌ప్రింట్ ధృవీకరణ ఆధారంగా చెల్లించబడుతున్నాయి.

* నివాసం, వైద్యం, ఇతర సౌకర్యాలు ఒప్పంద ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని పరిశీలనలో తేలింది.

* పని చేయకుంటే జీతాలు చెల్లించలేమని, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కార్మికులు ఆర్థిక పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఈ 12 మంది కార్మికులు పనికి హాజరుకాకుండా రూముల్లో ఉన్నారని, ఇది ఒప్పంద ఉల్లంఘనగా పరిగణించబడే అవకాశం ఉందని ఎంబసీ అధికారులు తెలిపారు.
ఈ పరిస్థితిలో ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్
(ఐసిడబ్ల్యూఎఫ్) కింద వీరు ప్రయోజనాలు పొందడం కష్టమని వారు పేర్కొన్నారు.