కొండా లక్ష్మా రెడ్డి మృతి పట్ల జర్నలిస్టు సంఘాలు సంతాపం!

J SURENDER KUMAR,

ఎన్ఎస్ఎస్ వార్తా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్,
చేవెళ్ల మాజీ శాసనసభ్యులు, కొండా లక్ష్మారెడ్డి (84) సోమవారం మృతి  చెందారు.

లక్ష్మారెడ్డి మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయు) జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మీడియా  అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, జాతీయ మాజీ అధ్యక్షులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.విరాహత్ అలీ, కె. రాంనారాయణ, ఐజేయు కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కె. రాములు ప్రకటనలో ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసారు.

కొండారెడ్డి (ఫైల్ ఫోటో )

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనుమడైన లక్ష్మారెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా,  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గ్రీవెన్స్ సెల్ అధికార ప్రతినిధిగా, పలు హోదాల్లో పని చేశారని వారు తెలిపారు.

1999, 2014 లో రెండు పర్యాయాలు లక్ష్మారెడ్డి హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ కూడా చేశారన్నారు. జర్నలిజం వృత్తి పట్ల గల ఆసక్తి,  నిబద్ధత కారణంగా 1980లో ఆయన న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్(ఎన్ఎస్ఎస్) అనే ఒక వార్తా సంస్థ ప్రారంభించారని వారు పేర్కొన్నారు.

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా,  జర్నలిస్టుల సహకార గృహ నిర్మాణ సంఘం అధ్యక్షులుగా,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా జర్నలిస్టులకు లక్ష్మారెడ్డి సేవలందించారని వారు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజేలో కొండా లక్ష్మారెడ్డి తో కలిసి పని చేసిన సందర్భాలను, వారు సేవలను ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.