మలేసియాలో తప్పిపోయిన తెలంగాణ వాసి !

J.SURENDER KUMAR,

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసిపేట కు చెందిన ప్యాట విజయ్ కుమార్ (38) మలేసియాలో నాలుగు నెలల క్రితం తప్పిపోయాడు. తన భర్త ను  ఇండియాకు రప్పించాలని అతడి భార్య జ్యోతి మంగళవారం హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్ లో ‘సీఏం ప్రవాసీ ప్రజావాణి’ లో వినతిపత్రం ఇచ్చింది.

తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి ఆమెకు మార్గదర్శనం చేశారు.

2025 మే 28న ఇండిగో విమానంలో చెన్నయి నుంచి కౌలాలంపూర్ కు చేరుకున్న విజయ్, రెండు రోజులు డ్యూటీ చేసిన తర్వాత… మానసికంగా కుంగిపోయి, అసహనంతో ప్రవర్తిస్తున్నట్లు సమాచారం తెలిసి. అతన్ని ఇండియాకు వాపస్ తెప్పించడానికి అతని భార్య జ్యోతి రిటన్ టికెట్ కోసం జూన్ 3న ₹ 30 వేలు ఏజెంట్ కు పంపించింది.

విజయకుమార్ (ఫైల్ ఫోటో)


కానీ, జూన్ 6 నుంచి  అక్కడ అతడి జాడ తెలియడం లేదు. తాటికల్లు, ఈతకల్లులో డైజోఫాం, క్లోరోఫాం లను కలిపి తయారు చేసిన ‘గుల్ఫారం కల్లు’ ప్రభావంతో మతిస్థిమితం కోల్పోయినట్లు తెలుస్తున్నది.

గతంలో ఆమె సహాయం కోసం… నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ని, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి. వినయ్ క్రిష్ణా రెడ్డిని, బోధన్ పోలీసులను కలిసి తన గోడు వెళ్ళబోసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై విభాగం ద్వారా జులైలో మలేసియా లోని ఇండియన్ హై కమీషన్ ను సంప్రదించినా ఇప్పటివరకు ఆచూకీ విషయంలో పురోగతి లేదు.