👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR,
రాష్ట్రంలో మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాలు, బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2026 విద్యా సంవత్సరం జూన్ నుంచి అమలు జరిగే విధంగా ఈ కార్యాచరణ ప్రణాళిక ఉండాలని చెప్పారు.
👉 విద్యా శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు , వేం నరేందర్ రెడ్డి , ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి. బాలకిష్టా రెడ్డి తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

👉 ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. తొలి దశలో ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతంలో దృష్టి సారించాలని చెప్పారు.
👉 ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూళ్లకన్నా మెరుగ్గా ఉండాలని, ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతోపాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలని చెప్పారు. ఇలాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి విద్యా శాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు. సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలకు తరలించాలని చెప్పారు.
👉 నర్సరీ నుంచి 4 వ తరగతి వరకు నూతన స్కూల్స్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అక్కడ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాటు చేయాలని సూచించారు.