సీఎం సహకారంతో చర్చ్ కు హెరిటేజ్ గుర్తింపుకు కృషి చేస్తా!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ 150 ఏళ్ల చరిత్ర కలిగిన
సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో హెరిటేజ్ గుర్తింపుకు కృషి చేస్తా అని  ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఉత్సవాల కార్యక్రమంలో శనివారం పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఉత్సవాలలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను, ఉమ్మడి రాష్ట్రంలో ఇంత గొప్ప చరిత్ర కలిగిన చర్చ్‌ ఇదొక్కటే కావడం గర్వకారణం అన్నారు.

ఈ చర్చ్‌ ఆధ్వర్యంలో సుమారు 70 ఉప సంఘాలు పనిచేస్తున్నాయని తెలిసి ఎంతో సంతోషం కలిగింది అన్నారు.
స్వర్గీయ ముఖ్యమంత్రి డా. వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి  ఈ చర్చ్‌ను హెరిటేజ్ బిల్డింగ్‌గా గుర్తించే ప్రక్రియకు అంకురార్పణ చేశారు. అయితే, ఆయన ఆకస్మిక మరణంతో ఆ ప్రక్రియ ఆగిపోయినట్టు సమాచారం. నా వంతుగా హెరిటేజ్ గుర్తింపుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  నాయకత్వంలో నేను మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఈ చర్చ్‌ హెరిటేజ్ బిల్డింగ్‌గా గుర్తింపు పొందేలా, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందేలా కృషి చేస్తాను అని మంత్రి అన్నారు.

దీనికి మీ అందరి ప్రార్థనలు నాకు అవసరం. ఈ చారిత్రాత్మక చర్చ్‌కు ఆ గుర్తింపు తప్పకుండా వస్తుందని నాకు నమ్మకం ఉంది అన్నారు.

👉 మిషనరీల త్యాగం మరువ లేనిది !

భారతదేశానికే వచ్చి సర్వస్వాన్ని త్యాగం చేసి విద్యా, వైద్య రంగాల్లో సేవచేసిన వారు క్రైస్తవ మిషనరీలు ఆకలిగొన్న వారికి ఆహారం అందించి, రోగులకు వైద్యం అందించి, సమాజ ఉన్నతికి  కృషి చేసిన ఆ మహనీయుల త్యాగం మనందరికీ ఆదర్శం అన్నారు. మనం కూడా వారి త్యాగస్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత కలిగి ఉండాలి.

👉 సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్‌ – 150 ఏళ్ల గొప్ప చరిత్ర !

చర్చ్‌ 1875 నవంబర్ 14న స్థాపించబడింది.
ఒంగోలు నుండి ఎడ్లబండిపై ప్రయాణించి వచ్చిన మిషనరీలు డా. W.W. క్యాంప్‌బెల్, మరియు వారి సతీమణి శ్రీమతి లిడియా ఈ చర్చ్‌ను స్థాపించారు మంత్రి వివరించారు.

అదే కాలంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రజలకు అంకితం చేయబడటం కూడా చరిత్రలో విశేష ఘట్టం సేవాస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం ఈ చర్చ్‌.   చర్చ్‌ చారిటీ విభాగం ద్వారా పేదలకు విద్యా, వైద్య సేవలు అందించడం, ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడం నిజంగా ప్రశంసనీయం ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక సంస్థ మాత్రమే కాదు, సమాజ సేవలో అగ్రగామిగా నిలిచిన మహోన్నత సంస్థ అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 రాజ్యాంగ పరిరక్షణ – మన అందరి బాధ్యత!

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవే దేశ రాజ్యాంగాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి కృషి చేస్తున్న నాయకులకు మనం అండగా నిలవాలి.


దీనికోసం మీరు ప్రార్థనలతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా మీ భాగస్వామ్యాన్ని చూపాలి ఇది కేవలం మతపరమైన కర్తవ్యమే కాదు, దేశపట్ల మన బాధ్యత కూడా అన్నారు.
యేసు క్రీస్తు ఆశీర్వాదాలు మనందరిపై ఉండాలని ప్రార్థిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.