👉 2027 గోదావరి పుష్కరాలకు సకల ఏర్పాట్లు చేస్తాం !
👉 మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కొండ సురేఖ !
J.SURENDER KUMAR,
ఆతి పురాతన ప్రాచీన పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు.
ఆలయ మాస్టర్ ప్లాన్ సమీక్ష సమావేశం సోమవారం హైదరాబాద్ సచివాలయంలో జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దేవాదాయ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఎండోమెంటు డైరెక్టర్ హరీష్, డిపార్టుమెంటు ఉన్నతాధికారులు, ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు
👉 సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….
తన సొంత నియోజకవర్గంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని విస్తృతంగా అభివృద్ది పరుస్తున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఇంత పని ఒత్తిడిలోనూ తమ ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి… అభివృద్ధి చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధి కోసం కావలసిన స్థల సేకరణకి సంబంధించిన అంశాల్లో తాను ప్రత్యేకంగా చొరవ తీసుకుంటానని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.
అందరి సహకారంతో గోదావరి పుష్కరాలు కూడా విజయవంతంగా చేస్తామని హామీ ఇస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.

👉 ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ…
వందలాది సంవత్సరాలు చరిత్ర గల ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు ఆగమశాస్త్రం, వేద పండితులు, స్థానికుల, భక్తులు మనోభావాలకు అనుగుణంగా పునర్నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ధర్మపురిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభు మూర్తి, ఋషులు, దేవతలు సంచరించిన పవిత్ర ప్రాంతం, ఈ అంశం దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.
2027 జూలై లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ధర్మపురిలోని గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని మంత్రి ఆదేశించారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

మాస్టర్ ప్లాన్ కు అవసరమైన స్థల సేకరణ వివరాలు మంత్రి, అధికారులను అడిగి సంపూర్ణంగా తెలుసుకున్నారు. స్థల పురాణం ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం ₹ 50 కోట్లతో చేపట్టే నిర్మాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా చూడాలని చెప్పారు.
👉 మాస్టర్ ప్లాన్ లో భాగంగా ధర్మపురి ఆలయంలో అభివృద్ధి పనులు !
1. ప్రధాన దేవాలయ విస్తరణ, వైకుంఠ ద్వార నిర్మాణం, క్యూలైన్ కాంప్లెక్స్, టిన్ షెడ్స్!
2. వ్రత మండప నిర్మాణం, కాలక్షేప మండప నిర్మాణం !
3. ప్రసాదం కౌంటర్ల నిర్మాణం, నిత్య కళ్యాణ మండప నిర్మాణం, మహా ప్రాకార నిర్మాణ, రథశాల నిర్మాణ, జల ప్రసాదం డ్రింకింగ్ వాటర్ వసతుల ఏర్పాట్లు.!
👉 గోదావరి తీరంలో గల స్థలంలో చేపట్టే నిర్మాణాలు !
1. పెద్ద డార్మిటరీ హాల్స్ నిర్మాణం, స్త్రీలు బట్టలు మార్చుకొనుటకు డ్రెస్ ఛేంజింగ్ రూమ్స్ నిర్మాణం!
2. సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం, షవర్స్ నిర్మాణం, జలప్రసాదం వసతి, మండప నిర్మాణం, నిత్యాన్నదాన భవనం నిర్మాణం.!
👉 ప్రతిపాదిత అభివృద్ధి పనులు!
1. శ్రీ యోగనృసింహస్వామి ( ప్రధాన దేవాలయం ) ఆలయం పునఃనిర్మాణం ₹ 2 కోట్లు. !
2 శ్రీ ఉగ్రనరసింహస్వామి దేవాలయం పునఃనిర్మాణం ₹ 5.50 కోట్లు !
3 శ్రీ యమధర్మరాజు దేవాలయం పునఃనిర్మాణం ₹ 20 లక్షలు !
4 రథశాల మరియు 3 రథముల నిర్మాణము ₹ 300 లక్షలు !
5 బ్రాహ్మణ సంఘ భవణం ప్రక్కన కళ్యాణ మండపం నిర్మాణం ₹ 700 లక్షలు!
6 బ్రహ్మపుష్కరిణి (కోనేరు) రెనవేషన్ ₹400 లక్షలు!
7 దేవాలయములో నూతన హోమశాల నిర్మాణం. ₹ 50 లక్షలు!
8 శ్రీ సత్యవతి దేవాలయం (ఇసుకస్థంభం) అభివృద్ధి ₹ 30 లక్షలు !
9 గోదావరి తీరమున రెండు (2) పెద్ద డార్మిటరీ హాల్స్ నిర్మాణం ₹ 300 లక్షలు !
10 గోదావరి తీరమున స్త్రీలకు శాశ్వతంగా డ్రెస్ చేంజింగ్ రూంలు ₹ 70 లక్షలు !
11 గోదావరి తీరమున శాశ్వత సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం రూ.80 లక్షలు !
12 వి.వి.ఐ.పిల కొరకు అన్ని రకాల సౌకర్యాలతో 4 సూట్ నిర్మాణం ₹ 310 లక్షలు!
13 చింతామణి చెరువులో వరాహమూర్తి విగ్రహం ఏర్పాటు ₹ 75 లక్షలు !
14 వివిధ అవసర అభివృద్ది నిర్మాణ పనులు & “క్యూ” లైన్స్ ఏర్పాటు ₹115 లక్షలు ! మొదటి విడత మొత్తం ₹ 50 కోట్లు ఖర్చు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.
