👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR,
కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకంపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
👉 రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీర పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , ఇతమంత్రివర్గ సహచరులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్యల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
👉 “రాష్ట్రంలో ఏ ఒక్క మహిళా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు సారె, చీర ఇవ్వడం సంప్రదాయం. ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలందరికీ సారె అందించాలని ఇందిరమ్మ చీరలను పంపిణీ కార్యక్రమం చేపట్టాం.
👉 అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ నిర్దేశించిన గడువులోగా విడతల వారిగా పంపిణీ పూర్తి చేయాలి. ప్రజా ప్రతినిధులకు ప్రత్యేకంగా సమాచారం ఇవ్వండి.

👉 ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక అధికారిని నియమించి ఈ కార్యక్రమ బాధ్యతలను అప్పగించాలి. మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి కార్యక్రమం కింద చేపడుతున్న చీరల పంపిణీ పథకం గురించి ముందుగానే ప్రజలందరికీ తెలిసేలా చెప్పండి.
👉 మహిళా సంఘాలు ఉత్పత్తులను శిల్పారామంలో కేటాయించిన ఇందిరా శక్తి బజార్లో మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాం. అలాగే మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తేవాలని అమెజాన్ ద్వారా ఆన్లైన్లో ఉత్పత్తులను విక్రయించుకునే అంశంపై ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం.
👉 ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹27 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా వాటికి యజమానులను చేయడం, అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణను అప్పగించడం, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు అప్పగించడం వంటి చర్యల అనేక కార్యక్రమాల ద్వారా వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళుతున్నాం.
👉 మహిళా సంఘాలకు ఇప్పటివరకు డ్రెస్కోడ్ లేని కారణంగా సరైన గుర్తింపు లభించలేదు. వడ్డీలేని రుణాలు అందించడంలో గతంలో నిర్లక్ష్యం జరిగింది. వాటిని సరిదిద్దుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతోంది. చీరల పంపిణీని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నది ప్రభుత్వ విధానం.
👉 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఆడబిడ్డ ఆర్థికంగా బలపడితే కుటుంబాల్లో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

👉 చీరల పంపిణీ విషయంలో ఎలాంటి లోటుపాట్లు చూడాలి. కుల గణన సందర్భంగా సేకరించిన వివరాల డేటా కలెక్టర్ల వద్ద ఉంది. ఫేషియల్ రికగ్నిషన్తో పాటు ఆధార్ నంబర్ నమోదు చేసుకుని ఎక్కడా తప్పులు జరక్కుండా పారదర్శకంగా పంపిణీ కార్యక్రమం జరగాలి.
👉 చీరల విషయంలో ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదు. మున్సిపాలిటీలు, పట్టణాల్లో రెండో విడతలో చీరలు అందిస్తాం. ఏ మహిళకూ చీర అందలేదన్న సమస్య ఉత్పన్నం కావొద్దు. తూతూ మంత్రంగా కార్యక్రమం నిర్వహించడానికి వీలులేదు. భవిష్యత్తులో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ కార్యక్రమాన్ని ప్రామాణికంగా తీసుకునేలా, అందరూ సమన్వయంతో పనిచేయాలి” అని మార్గనిర్దేశం చేశారు.
👉 వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మహిళా సమాఖ్య ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. చీరల తయారీ సందర్భంగా సమాఖ్య ప్రతినిధులు సిరిసిల్లాకు వచ్చి పరిశీలించి బాగున్నాయని చెప్పారని సిరిసిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య తెలిపారు.

👉 చీరల రంగు, డిజైన్ బాగున్నాయని ఆసిఫాబాద్ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి చెప్పారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులు ఎలా నడుస్తున్నాయని ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి ని ముఖ్యమంత్రి వాకబు చేశారు.
👉 సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , వాకిటి శ్రీహరి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
