న్యాయవాదుల హత్యలో నాడు హైకోర్టు నేడు సుప్రీంకోర్టు!

👉  హత్య తీరుపై ప్రచురితమైన వార్తను  సుమోటోగా  చేపట్టిన తెలంగాణ హైకోర్టు !

👉  హత్య కేసును  సి.బి.ఐ విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు !

J.SURENDER KUMAR,

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాదులు, వామన్ రావు నాగమణి  దంపతులు హత్య ఉదాంతంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.


నాలుగు సంవత్సరాల క్రితమే న్యాయవాద దంపతుల దారుణ హత్య జరిగిన తీరు గూర్చి ప్రచురితమైన హృదయ విదారక కథనం దినపత్రికలో 2021 ఫిబ్రవరి 18న  ప్రచురితమైంది. ఆ వార్తా కథనం పై స్పందించిన తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యను సుమోటోగా W.P. No Sou moto -2 ,2021 గా స్వీకరించి  తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగానికి నోటీసులు జారీ వివరాలు కోరింది.

👉  సూత్రధారుల కోసం హతుడు వామన్ రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టుకు….

2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో ఈ దారుణ హత్య జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పుట్టా మధూకర్‌ పేరును తెలంగాణ పోలీసులు అభియోగపత్రంలో చేర్చకుండా దర్యాప్తు తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ, నిష్పాక్షిక విచారణ కోసం కేసును సీబీఐకి అప్పగించాలంటూ వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


కిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ విషయంలో తదుపరి విచారణ అవసరమని పేర్కొంటూ, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం కేసును సిబిఐకి బదిలీ చేస్తూ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు 2025 ఆగస్టు మాసంలో ఆదేశాలు జారీ చేసింది.

👉 2021 సెప్టెంబరు18న సుప్రీంకోర్టులో కిషన్ రావు రివ్యూ పిటిషన్‌ !

హత్యకు గురి అయిన వామన్ రావు తండ్రి  కిషన్‌రావు హైకోర్టులో కూడా పిటిషన్‌ వేశారు. అయితే, 2021 మే 19న దర్యాప్తు అధికారి పూర్తి ఛార్జీషీట్‌ దాఖలు చేశారని, అందువల్ల తిరిగి దర్యాప్తు కు ఆదేశించాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.

ఈ తీర్పును సవాలు చేస్తూ 2021 సెప్టెంబరు 18న సుప్రీంకోర్టులో కిషన్ రావు రివ్యూ పిటిషన్‌ వేశారు. సెప్టెంబరు నుంచి పలు సార్లు విచారణ జరిగింది. చివరగా 2025 మే 13 న సుప్రీం ధర్మాసనం వాదనలు వినింది.


విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫున వాదన వినిపించిన న్యాయవాదులు, వామన్‌రావు తన మరణానికి ముందు ఇచ్చిన వీడియో వాంగ్మూలంలో ప్రధాన సూత్రధారి పేరు స్పష్టంగా ఉన్నదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

👉 విచారణ అధికారుల పై…?

న్యాయవాద దంపతులు హత్య జరిగిన ప్రదేశం రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కేసు నమోదు చేసి ఎక్స్ ప్రెస్ ఎఫ్ఐఆర్ జారీ చేయాల్సిన స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎఫ్ఐఆర్ లో    హతుల బంధువులు ఫిర్యాదు చేసిన పేర్లు నాటి ఎస్సై నమోదు చేయలేదని, విచారణ తర్వాత ఆ పేర్లు పరిశీలిస్తామని ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేయడానికి నిరాకరించిన ఆరోపణల పై సిబిఐ అధికారులు దృష్టి సారించినట్టు చర్చ.

హైకోర్టుకు విచారణ అధికారులు సమర్పించిన నివేదిక, చార్జిషీట్ లో నమోదు చేసిన వివరాలు, విచారణలో వెలుగు చూస్తున్న అంశాలు ( సుమోటో కేసులో  కోర్టుకు సమర్పించిన నివేదిక ) సాక్షులు, మంథని, గుంజపడుగు, మంథని కోర్టులో సీసీ కెమెరా ఫుటేజ్ లు, సాక్షుల వాంగ్మూలం, సెల్ పోన్ టవర్ లొకేషన్ లు, అనుమానిత ఫోన్లకు  ఇన్ కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్, వాట్సప్ మెసేజీలు, సంఘటన స్థలం పరిసరాల్లో సాటిలైట్ చిత్రాలు, తదితర కీలక ఆధారాల సేకరణలో సిబిఐ అధికారులు నిశితంగా పరిశీలిస్తూ, ఆచితూచి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం