సన్న బియ్యం పంపిణీ పథకం దేశమంతా అమలు చేయాలి !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

తెలంగాణలో అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని, ఈ సంక్షేమ పథకాన్ని  దేశమంతా అమలు చేయాలని, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి  ప్రహ్లాద్ జోషికి సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఈ పథకం గురించి వివరించారు.

👉 సన్నబియ్యం పంపిణీ వల్ల పీడీఎస్ బియ్యం రీ-సైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని చెప్పారు. ప్రజలు తినే బియ్యాన్ని పంపిణీ చేయటంతో ఈ పథకం ఆశించిన లక్ష్యం నెరవేరిందని అన్నారు. సమగ్రమైన అధ్యయనం చేసి  దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి  అన్నారు.

👉 హైదరాబాద్ వచ్చిన మంత్రి ప్రహ్లాద్ జోషి తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీఎస్ రామకృష్ణారావు , సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి , సివిల్ సప్లయిస్  ప్రిన్సిపల్ సెక్రెటరీ స్టీఫెన్ రవీంద్ర తో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి  పలు అంశాలను ప్రస్తావించారు.

👉 2024–25 రబీ సీజన్ కు సంబంధించి అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటా పెంచాలి.

👉 పీడిఎస్ కింద సరఫరా చేసిన లెవీ రైస్‌కు సంబంధించిన ₹1,468 కోట్ల సబ్సిడీ విడుదల చేయాలి.  

👉 పీఎంజీకేఏవై అయిదో దశకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ₹ 343.27 కోట్ల సబ్సిడీ  విడుదల చేయాలి. 

👉 2024 – 25 ఖరీఫ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ వ్యవధి పొడిగించాలని సీఎం  కోరారు. ఎఫ్ సీఐ గోదాముల్లో నిల్వ ఇబ్బందులను అధిగమించేందుకు అదనపు బాయిల్డ్ రైస్ రేక్ లు కేటాయించాలని,  రాష్ట్రంలో 15 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిల్వ సామర్థ్యం పెంచుకునేందుకు కేంద్రం సాయం అందించాలని కోరారు.

👉 2025–26 ఖరీఫ్ లో అత్యధికంగా 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని,  ధాన్యం కొనుగోలు  లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

👉 రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే దేశ వ్యాప్తంగా బాయిల్డ్ రైస్ అవసరం తగ్గిందని, అందువల్ల మిల్లింగ్‌కు అనువైన ముడి బియ్యం రకాల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో మిగులు ధాన్యం నిల్వలను సమర్థంగా నిర్వహించేందుకు ఎగుమతి అవకాశాలను పరిశీలించాలని సలహా ఇచ్చారు.

👉 ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని, బాయిల్డ్ రైస్ అదనపు కోటాను కేటాయించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రారైస్ కు అనువైన రకాల వరి సాగును ప్రోత్సహించేందుకు రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.