👉 గోదావరి పుష్కరాల ప్రణాళికపై ప్రాథమికంగా సమీక్షించిన కలెక్టర్ !
👉 ప్రతిరోజు 2 లక్షలమంది భక్తులు గోదావరి పుష్కరాలకు వచ్చిన ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేపట్టాలి !
J.SURENDER KUMAR,
జూలై 2027లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణంలో మాస్టర్ ప్లాన్ అమలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
👉 పుష్కరాలకు ధర్మపురి గోదావరి నది తీరంలో శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతి సదుపాయాలు ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని పుష్కరాలపై శుక్రవారం రాత్రి జరిగిన ప్రాథమిక సమీక్షలో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
👉 ధర్మపురిలోని గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు.

👉 పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
👉 2027లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
👉 జిల్లాలో ప్రవేశించే గోదావరి నది తీరం వెంట ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులకు సూచించారు. పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు.
👉 ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తాగు నీరు, స్నానాల ఘాట్లతో పాటు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలన్నీ ఉండేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

👉 స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్తో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటితో సమన్వయం ఉండే పనులు గుర్తించి, వాటికి అవసరమైన అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు.
👉 ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు బి.ఎస్. లత, బి. రాజ గౌడ్ , డిపివో రఘువరన్, ఆర్డీవో మధుసూదన్,శిక్షణ డిప్యూటీ కలెక్టర్ హరిణి, రేవంత్, ధర్మపురి ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి సంకటాల శ్రీనివాస్ జిల్లా సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
