👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర అత్యంత కీలకమని గ్రామ స్థాయి పాలన బలపడితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక పొన్నాల గార్డెన్స్లో మంగళవారం నూతనంగా ఎన్నికైన జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాజంగి నందయ్య లు పాల్గొని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను ఘనంగా సన్మానించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

ప్రజల విశ్వాసంతో ఎన్నికైన సర్పంచ్లందరికీ హృదయపూర్వక అభినందనలు అని అన్నారు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అందేలా సర్పంచ్లు బాధ్యతగా పనిచేయాలని మంత్రి సూచించారు.
ప్రధానంగా విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సర్పంచ్ లు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ, పారదర్శక పాలనతో ప్రజల విశ్వాసాన్ని మరింత బలపర్చాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.

ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం పట్ల ఎప్పుడూ నిబద్ధతతో పనిచేస్తుందని, ప్రజల అవసరాలను తెలుసుకొని వాటికి పరిష్కారాలు చూపడమే పార్టీ విధానమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
