J.SURENDER KUMAR,
మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని. ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
👉 మేడారం అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు ఉన్నతాధికారులతో సోమవారం జరిగిన సమావేశంలో సమీక్షించారు.
👉 మేడారం అభివృద్ధిలో భాగంగా రాతి పనులతో పాటు రహదారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గద్దెల చుట్టూ భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, భక్తులు వేచి ఉండే ప్రదేశాలు ఇలా ప్రతి ఒక్క అంశంపైనా ముఖ్యమంత్రి అధికారులకు సూచనలు చేశారు.
👉 పనులు సాగుతున్న తీరుపై ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, స్థపతి శివనాగిరెడ్డి సమన్వయంతో సాగాలని ముఖ్యమంత్రి సూచించారు.

👉 అభివృద్ధి పనుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు పెద్ద పీట వేయాలని మరోసారి స్పష్టంగా చెప్పారు. నిర్దేశిత సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి కావాలని ఆదేశించారు.
👉 ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ , ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
