రేపటి ముక్కోటికి ముస్తాబైన ధర్మపురి క్షేత్రం !

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా క్షేత్రం ఆలయం ఆలయ ప్రాంగణం అంగరంగ వైభవంగా ముస్తాబయింది.

ఫైల్ ఫోటో.

స్థానిక శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారు ప్రాతః కాలములో వైకుంఠ ద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తేరువనున్నారు.

👉ముక్కోటి వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు..

ముక్కోటి ఏకాదశి పర్వదినము రోజున ప్రాతంకాలము (ఉదయత్ పూర్వం) 3 గం॥లకు శ్రీలక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల వార్లు మూల విరాట్లకు విశేష క్షీరాభిషేకములు, నివేదన వేదమంత్ర పుష్పములు..

👉 ప్రాతఃకాలమున 4.00 గం॥టలకు వైకుంఠ ద్వారము వద్ద పుష్ప వేదికపై వేంచేపు చేయించి మువ్వురు స్వాములకు ప్రత్యేక పూజలు

👉 ఉ॥5.00 గం॥లకు మంగళ వాయిద్యముల మధ్యన, వేద మంత్రములతో శ్రీమఠాధిపతి శ్రీమత్ పరమహంస పరివాజ్రకాచార్యులు శ్రీశ్రీశ్రీ సచ్చితానంద సరస్వతి మహాస్వాముల వారి కరకమలములచే వైకుంఠ ద్వారము తెరువబడును.

👉 భక్తుల దర్శన అనంతరము శ్రీవార్ల ఉత్సవ మూర్తుల సేవలు పుర వీధులలో ఉదయం 8-00 గంటలకు ఊరేగింపు నిర్వహించబడును.

👉ముక్కోటి విశిష్టత…

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం ॥ నృసింహం భీషణం భద్రం | మృత్యోర్ మృత్యుం నమామ్యహం ॥

అసురుల హింసలకు తాళలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మకడకేతెంచి బాధలు వివరించి నివారింపమనికోరిరి. బ్రహ్మవారిని ఓదార్చి ధనుర్మాసం శుక్లపక్ష ఏకాదశి ప్రభాత కాలములో వైకుంఠ పురమునకేతెంచి,

వైకుంఠనగరపు ఉత్తరద్వారము వద్ద నిలువగ వందిమాగధుల సుప్రభాతంతో, సనక సనందాది ఋషివర్యులు స్తుతులతో, ద్వారపాలకులు మంగళవాయిద్యములు మ్రోగిస్తుండగా వైకుంఠద్వారము తెరువగ శేషతల్పముపై పవళించి, లక్ష్మీదేవి పాదాలు పట్టుచుండగా

కోటి సూర్య తేజోమూర్తియైన స్వామిని చూసిన దేవతలు “పశ్యన్ నిముషమాత్రేన కోటి యజ్ఞఫలం లభేత్” అని అనుకొన్నారు. అనగా స్వామిని ఉత్తరద్వారము నుండి “ఒక్కక్షణం చూసినంతనే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుందని” బ్రహ్మాండ పురాణంలో వివరించబడినది.

ధర్మపురి ఆలయాలు వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించడంతోపాటు ద్వారా తోరణాలు ఏర్పాటు చేశారు. పుష్పాలు విద్యుత్తు కాంతులతో ఆలయ ప్రాంగణం అపర వైకుంఠంలో విరాజిల్లుతున్నది.