ఏఐ కౌన్సిల్ ను ఏర్పాటు చేయండి సీఎం రేవంత్ రెడ్డి !

👉 ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 లో
ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి !

J.SURENDER KUMAR,

కృత్రిమ మేధస్సు (Artificial  Intelligence) యావత్ ప్రపంచాన్ని తీవ్ర ప్రభావం చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ తరహాలో “ఏఐ కౌన్సిల్”ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రధానమంత్రి ని కోరారు. అలాగే జాతీయ భద్రత, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఉండేందుకు చట్టపరమైన రక్షణ చర్యలు రూపొందించే ప్రత్యేక “ఏఐ మంత్రిత్వ శాఖ”ను ఏర్పాటు చేయాలని సూచించారు.

👉 న్యూఢిల్లీలోని భారత్ మండపంలో శుక్రవారం జరిగిన ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ముఖ్యమంత్రి  కీలకోపన్యాసం చేశారు. భారత ప్రభుత్వం సహకారంతో దేశానికి ఒక “ఏఐ స్టార్టప్ విలేజ్”ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని ప్రకటించారు.


👉 ఏఐలో శరవేగంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి నిరంతరం అభివృద్ధిని పర్యవేక్షించే “జాతీయ ఏఐ వార్‌రూమ్” ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. కేంద్రం అనుమతిస్తే అందుకు హైదరాబాద్ కేంద్రంగా వార్‌రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు.


👉 ఏఐ పురోగతిలో తెలంగాణతో భాగస్వామ్యం కావాలని సదస్సు ద్వారా ప్రపంచ నాయకులు, సాంకేతిక నిపుణులకు ముఖ్యమంత్రి  ఆహ్వానం పలికారు. సామాజిక న్యాయ సాధనకు, పేదరిక నిర్మూలనకు ఏఐను శక్తివంతమైన సాధనంగా వినియోగించాల్సిన అవసరాన్ని ప్రధానంగా నొక్కిచెప్పారు.


👉 వేగంగా మారుతున్న సాంకేతిక యుగంలో ఏఐకి సంబంధించి ప్రతి ఏటా ఒక్కసారి జరిగే చర్చలు సరిపోవని పేర్కొంటూ, దేశంలోని వివిధ నగరాలలో సంవత్సరానికి రెండుసార్లు ఏఐ సమ్మిట్‌లు నిర్వహించాలని ముఖ్యమంత్రి  ప్రతిపాదించారు.


👉 GPU చిప్ తయారీ, గ్రీన్ ఎనర్జీ, డేటా స్టోరేజీ, కోర్ ల్యాంగ్వేజెస్ ఆధారిత సేవల వరకు ఏఐ చైన్ మొత్తం మీద భారతదేశం నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకు భారత్‌కు స్పష్టమైన రోడ్‌మ్యాప్ అవసరమని పేర్కొన్నారు.


👉 స్టార్టప్‌లకు మద్దతుగా నిలవడానికి, భారత యువత ప్రపంచ స్థాయి యూనికార్న్ సంస్థలుగా ఎదిగేందుకు ఏఐ రంగంలో ఏమాత్రం జాప్యం చేయకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోకుండా, వారికి మరిన్ని అవకాశాలు సృష్టించేలా సమగ్ర రీ-స్కిల్లింగ్ వ్యూహాలు అమలు చేయాలన్నారు.


👉 గత యంత్రాలు మానవ శారీరక శక్తి ఆధారంగా పనిచేయగా, ఆధునిక GPU చిప్‌లతో నడిచే ఏఐ వ్యవస్థలు విశ్లేషించడం, నిర్ణయించడం, సృష్టించడం, స్వతహాగా చర్యలు చేపట్టడం వంటి మేధో సామర్థ్యాలను కలిగి ఉండటం ముఖ్యంగా రోబోటిక్స్‌ను ఉదహరిస్తూ ఇదొక కీలక మార్పు అని అన్నారు.


👉 కొన్ని దేశాల్లో ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని ముఖ్యమంత్రి  హెచ్చరించారు. సేవల రంగంలో దేశం పురోగతి సాధించినప్పటికీ, ప్రపంచ స్థాయి ప్లాట్‌ఫార్మ్‌ల సృష్టికర్తగా నిలబడలేకపోయామన్నారు. ప్లాట్‌ఫార్మ్‌లకు సేవలందించే దేశంగా మాత్రమే నిలిచామని పేర్కొన్నారు. గూగుల్ సెర్చ్, మ్యాప్స్, మెటా సంస్థలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, వాట్సాప్ వంటి విస్తృతంగా వినియోగించే సేవలు భారతదేశంలో సృష్టించబడలేదని గుర్తుచేశారు.


👉  భారత్ ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలని రేవంత్ రెడ్డి  పునరుద్ఘాటించారు. దృఢమైన విధానాలు, బలమైన సంస్థలు, వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా భారతదేశం కేవలం నామమాత్రపు పాత్రలో కాకుండా కృత్రిమ మేధస్సు రంగంలో ప్రపంచ నాయకుడిగా అవతరించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.