👉 ₹1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపజేయడంతో..
J.SURENDER KUMAR,
ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఆరోగ్య పథకం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించి తమ దశాబ్దాల కోరిక నెరవేర్చారంటూ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు ₹1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపజేయడంతో పాటు, ₹1,056 కోట్ల మూలనిధితో ఆరోగ్య పథకానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.

👉 ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని, 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్సలు పొందే అవకాశం కల్పించడం ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక వరమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ ఉద్యోగ వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు.

👉 ముఖ్యమంత్రిని కలిసిన వారిలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐకాస నాయకులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, పి.దామోదర్ రెడ్డి (పీఆర్టీయూ), చావా రవి (యూటీఎఫ్), కే.వెంకటేశ్వర్లు (టీఎన్జీవో), ఉపేందర్ రెడ్డి (టీజీవో), జి.సదానందగౌడ్ (ఎస్టీయూ), దామోదర్ రెడ్డి, ఉమాదేవి (పెన్షనర్స్), వి.రవీందర్ రెడ్డి (రెవెన్యూ), గిరి శ్రీనివాస్ రెడ్డి (సెక్రటేరియట్), ఖాదర్ (ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్), టి.లక్ష్మన్ (ఎక్సైజ్), తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి , కె.రామకృష్ణ (డిప్యూటీ కలెక్టర్ల సంఘం), ఎస్.రాములు, రమేష్ పాక, సీహెచ్.శ్రీనివాస్ (తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్), బాణాల రాంరెడ్డి, వి.భిక్షం (తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్), డా.నిర్మల, ఎల్.దశరథ్ (టీజీసీపీఎస్ఈయూ), గరికె ఉపేందర్రావు (జీపీవో), సుగంధిని (హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్డబ్ల్యూ), భూమేశ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
