గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుతా !

👉 ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

గోదావరి నదీ జలాల వినియోగం, దానిపై తలెత్తిన వివాదాలు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అన్ని అంశాలపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సమగ్రంగా ఒకరోజు చర్చిస్తామని ముఖ్యమంత్రి   ఎ. రేవంత్ రెడ్డి  చెప్పారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుతామని, ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కరలేదని పునరుద్ఘాటించారు.

👉 ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్‌ను ముఖ్యమంత్రి  పరిశీలించారు. ఇంజనీర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.


👉 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి  ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి దేవాదుల ఇంటేక్ పాయింట్ వద్ద మోటార్లను పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు స్థితిగతులపై ముఖ్యమంత్రి  సమీక్ష నిర్వహించారు.


👉 అనంతరం ముఖ్యమంత్రి  మాట్లాడుతూ, “తెలంగాణ నీటి హక్కుల విషయంలో శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నాం. ఒక ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముందుకు వెళుతున్నాం. అవసరమైన నిధులను సమీకరిస్తున్నాం.


👉  ఎంతటి జఠిలమైన సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కారమవుతుందని బలంగా విశ్వసిస్తా. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుతూ శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. మాకు ఎలాంటి బేషజాలు లేవు.


👉 అధికారుల స్థాయిలో, రెండు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చల్లో తేలకపోతే కేంద్ర ప్రభుత్వం వద్ద, లేదా రివర్ మేనేజ్మెంట్ బోర్డుల వద్ద, ట్రిబ్యునళ్ల ముందు లేదా సుప్రీంకోర్టు వరకు ఏదైనా దశల వారిగా వెళ్లాలి.


👉 తెలంగాణ నీటి హక్కులను కాపాడే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కరలేదు. నీటి హక్కుల విషయంలో అనవసరమైన గందరగోళానికి గురిచేయొద్దు. సహేతుకమైన విమర్శలు చేయాలి. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలపై హక్కులను కాపాడుకుంటాం.


👉 గోదావరి నదిపై ప్రాజెక్టులను పూర్తి చేసుకుని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాలి. అనవసరమైన వివాదాలు, గందరగోళపరిచే విమర్శల వల్ల ప్రయోజనం లేదు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ ఏర్పడినప్పుడు నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ విధానపరమైన లోపాలు, ఆలోచనల కారణంగానో ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి.


👉 గడిచిన పదేళ్లలో చిత్తశుద్ధితో ప్రాజెక్టులను పూర్తి చేసి 967 టీఎంసీల నీటిని వినియోగంలోకి తెచ్చుకుని ఉంటే, వరద జలాలపైనా, వాటా నీటిని తరలించడానికి అవకాశం ఉండే. 2001 లో మొదలైన దేవాదుల రెండు దశాబ్దాలు దాటినా ఇంకా సాగుతూనే ఉంది.


👉 ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు నిధుల సమస్య వచ్చింది. ₹ 8.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉండటం వల్ల అవసరమైన నిధులు విడుదల చేయాలంటే కొరత ఉంది. అందుకే సమీక్షించి వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


👉 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇప్పటికే అంచనాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. ఈ విధానానికి ముగింపు పలకాలి. సవరించిన అంచనాలను సవరించి మంత్రివర్గం ఆమోదంతో పనులను వెంటనే పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నాం.


👉 తుమ్మడిహెట్టి నుంచి భద్రాచలం వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులపైన పూర్తిస్థాయి సమీక్ష చేసి వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాళేశ్వరం నుంచి చుక్కనీటిని ఎత్తిపోయకుండానే తెలంగాణలో అత్యధిక దిగుబడి సాధించాం.


👉 గోదావరి, కృష్ణా జలాలపై పక్క రాష్ట్రానికి తరలించడానికి సహకరిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆరోపణలు సరికాదు. గోదావరి నదీ జలాలపై శాసనసభలో చర్చ చేద్దాం. సూచనలు ఇవ్వండి. చవకబారు ఆరోపణలతో ప్రయోజనం లేదు. తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయొద్దు. ప్రతిపక్షం ఇచ్చే మంచి సూచనలను  స్వీకరిస్తాం.


👉 కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తెలంగాణ ప్రజల ఆస్తి. గాలికి వదిలేయం. ప్రజలకు ఉపయోగపడేలా చేస్తాం. బ్యారేజీలకు సంబంధించి ఆనకట్టలకు సంబంధించి భూమి లోపల ఎమైనా సమస్యలున్నాయా అన్న కోణంలో కూడా విశ్లేషణలు జరగాలి. ఆ ప్రాజెక్టు భవిష్యత్తులో ప్రమాదకరంగా మారకూడదన్న ఆలోచనతో ఉన్నాం. ఆ తర్వాత ఆ బ్యారేజీలను పునరుద్ధరిస్తాం..” అని స్పష్టం చేశారు.


👉 ఇటీవల జరిగిన మేడారం శ్రీ సమ్మక్క – సారలమ్మ మహాజాతర బ్రహ్మాండంగా సాగిందని అన్నారు. దక్షిణ కుంభమేళా తరహాలో జాతర జరిగిందని పేర్కొంటూ, మేడారం అభివృద్ధికి సంబంధించి భక్తులు నిరంతరం సందర్శించేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల తర్వాత మరోసారి మేడారం సందర్శించి సమీక్షిస్తానని చెప్పారు.