హైదరాబాద్ ను దేశానికే నమూనాగా నిలబెడతాం!

👉 ముంబై క్లైమెట్ వీక్ సదస్సులో !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ను కాలుష్యరహిత గ్రీన్, నెట్ జీరో సేవల కేంద్రంగా అభివృద్ధి చేసి, సుస్థిర పట్టణాభివృద్ధిలో హైదరాబాద్ నగరాన్ని దేశానికే ఒక నమూనాగా నిలబెడతామని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చెప్పారు. కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందని, రాబోయే ఐదేళ్లలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లో కాలుష్య కారక పరిశ్రమలు ఉండవని స్పష్టం చేశారు.

👉 ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన “ముంబై క్లైమెట్ వీక్” సదస్సులో నీతి ఆయోగ్  వైస్ చైర్మన్‌గా సుమన్ బేరీ , ఇతర అతిథులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాల్గొని ప్రసంగించారు. నగరాభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాలపై ముఖ్యమంత్రి తెలంగాణ దృక్పథాన్ని వివరించారు.


👉 గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని, తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోనూ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయన్నారు.


👉 తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రస్తావిస్తూ,  రాష్ట్ర జీడీపీని 200 బిలియన్ డాలర్ల స్థాయి నుండి 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, వనరులు, ఉపాధి ప్రధాన స్తంభాలుగా నిలుస్తాయని చెప్పారు.


👉 రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధికి తెలంగాణను CURE, PURE, RARE జోన్‌లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్‌ చుట్టూ 160 కి.మీ. పొడవున్న ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపలి ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)గా, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ (RRR) వరకు ఉన్న ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE) జోన్‌గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.


👉 ప్యూర్ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసి “చైనా +1” ప్రత్యామ్నాయంగా తెలంగాణను నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి  చెప్పారు. ఈ తయారీ వృద్ధి గ్రీన్ ఎనర్జీ ఆధారంగా సాగుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా, 360 కిలోమీటర్ల పొడవున్న రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం కొనసాగుతోందని, రీజినల్ రింగ్ రైల్వే ప్రణాళికలు అమలులో ఉన్నాయని ముఖ్యమంత్రి  తెలిపారు.


👉 తెలంగాణ విద్యుత్ వినియోగంపై మాట్లాడుతూ, 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంతో గరిష్ట డిమాండ్ 34,000 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశారు. ఇందులో గ్రీన్ ఎనర్జీ వాటా 25 శాతంగా ఉందని తెలిపారు.


👉 ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, ముఖ్యంగా డేటా సెంటర్లు, పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీని కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, శక్తి, ఉపాధి, వ్యవస్థాపకత (Entrepreneurship) మధ్య సమతుల్యతను సాధిస్తూ, గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణను మొత్తం దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి  స్పష్టం చేశారు.