👉 ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభానికి కసరత్తు !
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో (హైదరాబాద్ నగరం వెలుపల) తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తరగతి గదులు, క్రీడా మైదానం, ఇతర అన్ని రకాల వసతులు, బోధనా సిబ్బంది, రవాణా సౌకర్యం కలిగి ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలోనే ఈ వంద స్కూళ్లు ఉండాలని ఆదేశించారు.
👉 కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యా శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్యకు చిరునామాగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఇందుకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు, ఇంజనీర్లకు ముఖ్యమంత్రి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
👉 కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల తరహాలో నిర్మించాలి. వీటి నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని, ఏడాదిలో క్యూర్ పరిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ నూతన పాఠశాలల నిర్మాణం పూర్తి కావాలి.
👉 హైదరాబాద్ లోని భారతీయ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూళ్లలో ఉండే అన్ని వసతులు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ఉండాలి.
👉 క్యూర్లో అప్గ్రేడ్ చేయనున్న 17 పాఠశాలలు, అదనపు గదులు, ఇతర వసతులు కల్పించనున్న 164 పాఠశాలల పనుల్లో ఎటువంటి రాజీ పడకూడరాదు.
👉 ప్రభుత్వం ఆధ్వర్యంలో 99 రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాల్లో వారం రోజులు విద్యా సంబంధిత అంశాలకు కేటాయించాలి. ప్రజా ప్రతినిధులు, అధికారులు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి అవసరమైన వసతుల కల్పన, ఇతర అంశాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

👉 కృత్రిమ మేథ (AI) ప్రపంచాన్ని శాసిస్తున్న నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచి దాని బోధనకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలి. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఏఐపై ఉపాధ్యాయులు, లెక్చరర్లకు స్వల్పకాలిక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి.
👉 సాంకేతిక విద్యా విధానంలో అందుకు అనుగుణమైన మార్పులను తీసుకురావాలి. 2026-2027 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అమలు చేయాలి.
👉 బ్రేక్ఫాస్ట్తో పాటు ప్రతి విద్యార్థికి పాలు అందజేయాలి. పాలను విజయా డెయిరీ నుంచి సేకరించాలి. విద్యార్థులకు ఎన్ని క్యాలరీలు అందజేస్తున్నామనేది తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి.
👉 పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫాం, పుస్తకాలతో పాటు ఈ ఏడాది నుంచి కిట్ అందజేయాలి. ఆ కిట్ లో స్కూల్ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్లు, షార్పనర్లు, రంగుల పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డిక్షనరీ, బూట్లు, సాక్సులు ఉండాలి. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బడ్జెట్లో పొందుపర్చాలి.
👉 పాలిటెక్నిక్ కళాశాలలు, ఏటీసీల్లో ఏఐ ఆధారిత కోర్సులు వెంటనే ప్రారంభించాలి. కాలం చెల్లిన కోర్సులను తొలగించాలన్నారు. పాలిటెక్నిక్, ఏటీసీల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంటనే వివిధ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలి.
👉 రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాలకు నిధులు కేటాయిస్తాం. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీకి ₹1000 కోట్లు కేటాయించిన నేపథ్యంలో, మిగతా వర్సిటీలకు ఎంత నిధులు అవసరమనే దానిపై నివేదిక సమర్పించాలి.
👉 ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి తెలంగాణ ప్రైవేటు పాఠశాలల ఫీజు రెగ్యులటరీ మానిటరింగ్ కమిషన్ తమ నివేదికలోని అంశాలను ముఖ్యమంత్రి ముందుంచారు. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలు, తెలంగాణలో తీసుకోవాల్సిన అంశాలను వివరించారు.
👉 వివరాలు తెలుసుకున్న అనంతరం జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఈవోల నేతృత్వంలో పాఠశాలలను పరిశీలించి ఫీజుల నిర్ణయంపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ స్థాయిలోని కమిటీ తుది కమిటీగా ఉండి నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.
👉 అలాగే ఫీజు నియంత్రణకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, సామాజికవేత్తల అభిప్రాయ సేకరణకు ముసాయిదాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యా కమిషన్ సభ్యులు, విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
