మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది!

👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు !

J SURENDER KUMAR,

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు  రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మహాదేవపూర్ మండలంలోని గిరిజన సంక్షేమ భవన్‌లో కుట్టు మిషన్లు శిక్షణా కార్యక్రమం,  స్వయం సహాయక సంఘాల మహిళలకు  బ్యాంకు లింకేజీ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 

👉 ఈ సందర్భంగా మంత్రి శ్రీదర్ బాబు మాట్లాడుతూ….

మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు మహిళా సంఘాలకు ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు.   అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖల ద్వారా రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు మరియు ఉద్యాన యాంత్రీకరణ పరికరాలను అందజేశారు.

👉 మహిళలు శిక్షణతో పాటు ఉత్పత్తి సాధనకు కూడా మహిళలు కృషి చేయాలని సూచించారు. త్వరలోనే కాటారం, మంథని ప్రాంతంలో గార్మెంట్స్ చిన్న ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

👉 మహాదేవపూర్ ప్రాంతంలో అగరుబత్తుల తయారీకి సంబంధించిన పెద్ద అగరు వత్తుల  కంపెనీ ద్వారా మహిళలకు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.


👉శిక్షణ పొందిన మహిళలు నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసినప్పుడే వాటికి మంచి మార్కెట్ లభిస్తుందని, తద్వారా లాభాలు పొందవచ్చని మంత్రి తెలిపారు. రాజీవ్ యువశక్తి ద్వారా డైరీ ఉత్పత్తులపై కూడా శిక్షణ ఇవ్వాలని సూచించారు.


👉 ఒక సమగ్ర వ్యవస్థ ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. మహిళా శక్తి క్యాంటీన్లు సక్రమంగా నిర్వహించకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.


👉 మహిళలకు త్వరలోనే పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నట్లు, వాటి నిర్వహణకు అవసరమైన శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే వదినపల్లి, నాచారం ప్రాంతాల్లో సోలార్ పవర్ స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.


👉 రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేస్తోందని మంత్రి తెలిపారు. రైతులకు రైతు భరోసా పథకం, సన్న వడ్లకు బోనస్ అందిస్తున్నామని చెప్పారు.


👉 అలిమ్ సమస్త సంస్థ మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలను ముందుకు తీసుకెళ్తోందని మంత్రి అభినందించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణతో పాటు వివిధ సంస్థలను పరిచయం చేయాలని సూచించారు.


👉 వయాట్రీస్ మరియు అలిమ్ సంస్థల ద్వారా మూడు మండలాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కుట్టిన వస్త్రాలను మార్కెటింగ్ చేయడానికి కూడా అలిమ్ సంస్థ ముందుకు రావాలని కోరారు.


ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్,  గ్రంధాలయాలు సంస్థ చైర్మన్ రాజబాబు,  స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విజయలక్ష్మి,  గ్రంధాలయాల సంస్థ చైర్మన్ రాజబాబు,
డి ఆర్ డి ఓ బాలకృష్ణ, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు దండు రమేష్,  సర్పంచ్ హసీనా భాను తదితరులు పాల్గొన్నారు.