మావోయిస్టు పార్టీ రక్షణ కవచం కకావికలం !

👉 రెండున్నర దశాబ్దాల పీపుల్స్ వార్ గెరిల్లా ఆర్మీ చరిత్ర నేటితో సమాప్తం !

J SURENDER KUMAR,

మావోయిస్టు పార్టీ రక్షణ  కవచ విభాగం కకా వికలం అయింది, రెండున్నర దశాబ్దాలకు పైగా చరిత్ర గల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చరిత్ర శనివారం సమాప్తం అయింది. హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి ముందు 130 మంది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులు  అధునాతన ఆయుధాలతో లొంగిపోవడంతో  పి ఎల్ జి ఏ చరిత్ర ముగిసింది.

1997-98 లో  మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నల్ల ఆదిరెడ్డి, తదితర నాయకుల ఆలోచనలతో ఆవిర్భవించిన  పీపుల్స్ వార్ గేరిల్ల ఆర్మీ , కొయ్యూరు ఎన్కౌంటర్ తర్వాత నల్ల ఆదిరెడ్డి ,ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్  ల జ్ఞాపకార్థం 2000 సంవత్సరం నుంచి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలుగా నాటి వార్ అగ్రనాయకత్వం ప్రారంభించింది.

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తోపాటు, పోలిటిబ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులకు,  రీజనల్ కమిటీ ప్రతినిధులకు, రక్షణ కవచంగా ఉండే  (PLGA) పీపుల్స్ ప్రిపరేషన్ గెరిల్లా ఆర్మీ వ్యవస్థ సమూలంగా అంతరించి పోయినట్టేనని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి.

👉 10 కి పైగా బెటాలియన్లు …

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఆధ్వర్యంలో దాదాపు 10 నుంచి 15 బెటాలియన్లు ఉండేవి,  కగార్ ఆపరేషన్ , డి ఆర్ జి బలగాలు, బస్తార్ ఫైటర్స్, ఫారెస్ట్ బ్లాక్,  భద్రత బలగాలు దండకారణ్యంలో తమ ప్రాబల్యం పెంచుకోవడంతో.  పి ఎల్ జి ఏ లో రిక్రూట్మెంట్లు లేకపోవడం, అనారోగ్య ఇతర కారణాలతో కీలక నాయకుల లొంగుబాటులు, వరుస ఎన్కౌంటర్లుతో  క్రమక్రమంగా బెటాలియన్ల ఉనికి లేకుండా కనుమరుగు అవుతూ వచ్చింది.

శనివారం సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిన పి ఎల్ జి ఏ 130 మందిలో దేవుజ్జి రక్షణ కవచం సభ్యులు దాదాపు 40 మంది ఉన్నారు. వీరు  124 ఆయుధాలు, 5 వేల తూటాలను అప్పగించారని పోలీసులు వెల్లడించారు. ఇందులో 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 40 ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది బెటాలియన్ సభ్యులు ఉన్నారు,  దీంతో పి ఎల్ జి ఏ చరిత్ర ముగిసినట్టే.