👉 శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
మూసీ ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులో పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవరినీ నిరాశ్రయులను చేయమని, ఏ ఒక్కరికీ నష్టం జరక్కుండా వారందరికీ మరింత మెరుగైన వసతులతో ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
👉 శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి సమాధానమిస్తూ, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సహాయాన్ని అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
👉 మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ప్రణాళికలను క్షుణ్ణంగా చదివి, ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు చేస్తే ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని చెప్పారు.
👉 హైదరాబాద్ నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలు, 1 లక్షకు పైగా చ.కి.మీ మేర విస్తరించిన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ దార్శనికతను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సభముందు సమగ్రంగా వివరించారు.
👉 “దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో తలెత్తుతున్న విషమ పరిస్థితులను గమనంలోకి తీసుకుని చరిత్రాత్మక హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకురావడానికి, అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుకోవలసిన అవసరం ఉంది.
👉 నల్గొండ ప్రజల జీవన స్థితిగతులు, వారి ఆవేదనా భరితమైన జీవిత సత్యాల గురించి ఆలోచన చేసే వారెవరూ ఈ ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన చేయరు. కావాలనుకుంటే మూసీ ప్రక్షాళన అంశంపై సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ తో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తాం.
👉 ఏ రాష్ట్ర ప్రగతి అయినా ఆ రాష్ట్ర నగరాలు, పెట్టుబడులు, ప్రజల జీవన స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఎప్పుడు చర్చ జరిగినా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల గురించి ఎక్కువగా చర్చిస్తారు. హైదరాబాద్ అనగానే ప్రధానంగా ఫార్మా రంగంతో పాటు లివబుల్ సిటీగా గుర్తుచేసుకుంటారు.
👉 ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్న ముంబై వర్షాలొస్తే నివసించలేని పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం, బెంగళూరులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా విపరీతమైన ట్రాఫిక్ జామ్లు. భారీ వర్షాలొస్తే చెన్నైలో పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి.
👉 ఆ మహానగరాల్లో ఎదురవుతున్న అనుభవాలను చూసిన తర్వాత అత్యంత ప్రశాంత వాతావరణంలో, ఒకప్పుడు లేక్ అండ్ రాక్ సిటీగా విలసిల్లిన చారిత్రాత్మక హైదరాబాద్ ఇప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఆ సమస్యలు భూ భౌగోళిక పరిస్థితుల కారణంగా తలెత్తినవి కాదు. మానవ తప్పిదాల కారణంగా తలెత్తిన సమస్యలు.
👉 కులీకుతుబ్ షాహీల కాలంలో గుల్జార్ హౌజ్, ఫలక్నుమా, తారామతి భారాదరి, ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీల నుంచి మొదలు పెడితే ఈరోజు సమావేశాలు నిర్వహించుకుంటున్న శాసనమండలి హాలు.. ఇలా ఎంతో చరిత్ర కలిగిన అద్భుతమైన నగరం ఇప్పుడు కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందుల వంటి ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది.
👉 అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ మూడు ప్రాంతాలుగా విభజించి సమగ్రమైన ప్రణాళికలతో ఒక కార్యాచరణతో ముందుకు వెళుతున్నాం. 1.34 కోట్ల జనాభా కలిగిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాన్ని కోర్ అర్భన్ రీజియన్గా గుర్తించి కాలుష్య కారక రెడ్, ఆరెంజ్ జోన్లో ఉన్న పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని నిర్ణయించాం.
👉 తద్వారా ఈ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఈ క్రమంలోనే హిల్ట్ పాలసీ (HILTP) తీసుకొచ్చాం. కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలి వైపునకు తరలించి, ఇక్కడి పారిశ్రామిక జోన్లో ఉన్న భూములను మల్టీయూజ్ జోన్లోకి మార్చుతున్నామే, తప్ప యాజమాన్యపు హక్కులు మారవు. మల్టీయూజ్ జోన్లోకి మార్చడం వల్ల మధ్య తరగతి నివాస ప్రాంతాలుగా మారుతాయి.
👉 పరిశ్రమలను తరలించడం ద్వారా నగరం కాలుష్య రహిత ప్రాంతంగా ఉంటుందన్నది మొట్టమొదటి ప్రణాళిక. 20 టీఎంసీ గోదావరి నీటని తరలించి అందులో 17 టీఎంసీ జంటనగరాల తాగునీటి కోసం, మిగిలిన నీటిని మూసీలో నిరంతరం నీరు ప్రవహించేలా వినియోగిస్తాం.
👉 రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి కోసం సమగ్రమైన ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసుకున్నాం. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును ఆపాలని కాకుండా ముందుకు తీసుకెళ్లడానికి సలహాలివ్వండి. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఎవరినీ నిరాశ్రయులను చేయం. వారికి మరిన్ని మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తాం. ఏ ఒక్కరికి నష్టం చేయం..” అని ముఖ్యమంత్రి స్పష్టంగా వివరించారు.
